ఏపీలో కరోనా కల్లోలం: భారీగా కొత్త కేసులు, 64వేలకు పైగా, ఒక్కరోజే 65 మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజు రోజుకు మరింతగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6045 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 65 మరణాలు సంభవించాయి. కాగా, బుధవారం కొత్తగా 6494 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా, నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది. వీరిలో 823 మంది ప్రాణాలు కోల్పోగా, 32,127 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 31,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
జిల్లాలో వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురం 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, గుంటూరులో 842, కడప 229, కృష్ణా 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విశాఖపట్నం 1049, విజయనగరం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 మందికి కరోనా సోకింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 12,01,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,13,308 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 7,59,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 28,846 మంది కరోనా బారినపడి మరణించారు.