ఏపీ స్కూళ్ల రీఓపెన్ తొలిరోజు 61 శాతం హాజరు- అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూమ్
ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించాలని విజ్ఞప్తులు వచ్చినా ప్రభుత్వం ఇవాళ యథావిధిగా పాఠశాలలు, కాలేజీలు తెరిచింది. దీంతో విద్యార్దులకు సోకుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లితండ్రుల్లో అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇందులో రెండు నంబర్లను అందుబాటులో ఉంచింది.
సంక్రాంతి సెలవుల తర్వాత ఇవాళ తెరుచుకున్న పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ప్రకటించాారు. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో 61 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 70 శాతం, కడప జిల్లాలో 69 శాతం గుంటూరు 68 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 67 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని మంత్రి తెలిపారు.
తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కోవిడ్ కు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు, సందేహాల నివృత్తి కోసం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యాలయాల్లో కేటాయించిన ఫోన్ నెంబర్లకు ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు తెలిపి పరిష్కారం పొందవచ్చని ఆయన తెలిపారు.
పాఠశాల విద్యా కాంటాక్ట్ నెంబర్ : 7833888555.
ఇంటర్ విద్య కాంటాక్ట్ నెంబర్ : 9440816025.