జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు.. 66 ఏళ్ల వృద్దురాలి అరెస్ట్..? అసలేం జరిగింది...?
విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఫేస్బుక్లో దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు పూంతోట రంగనాయకి(66) అనే వృద్దురాలిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమెపై ఆరోపణలు నిజమేనని ధ్రువీకరించిన తర్వాతే కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు పట్టణంలోని ఆమె నివాసానికి వెళ్లి సోమవారం రాత్రి ఆమెకు నోటీసులు అందజేశారు. ప్రజల్లో భేదాభిప్రాయాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు నోటీసులు జారీ చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీనికి సహకరించిన మల్లాది రఘునాత్ అనే వ్యక్తిపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు.. 66 ఏళ్ల వృద్దురాలి అరెస్ట్.. అసలేం జరిగింది...?
పూంతోట రంగనాయకమ్మ ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే.. ఆమె టీడీపీ మద్దతుదారుగా అర్థమవుతోంది. ఇటీవల విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 పాయింట్లతో ఫేస్బుక్లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని అందులో ఆమె ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన గుంటూరు సీఐడీ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు.
ఏయే సెక్షన్ల కింద కేసులు..
ఐపీసీ సెక్షన్స్ 505(ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం),153(A)(రెండు గ్రూపుల మధ్య వైరాన్ని రెచ్చగొట్టడం),188(ప్రభుత్వ ఆదేశాల బేఖాతరు),120-B(నేరపూరిత కుట్ర)లతో పాటు 34ఐపీసీ,సెక్షన్ 67 ఐటీ యాక్ట్,2008ల కింద సీఐడీ పోలీసులు రంగనాయకిపై కేసులు నమోదు చేశారు. కేసులో రంగనాయకిని ప్రధాన ముద్దాయిగా పేర్కొన్న పోలీసులు.. మల్లాది రఘునాథ్ అనే వ్యక్తిని రెండవ ముద్దాయిగా పేర్కొన్నారు. ఆమెకు సహకరించాడన్న ఆరోపణలపై అతన్ని విచారిస్తున్నట్టు నోటీసుల్లో తెలిపారు.
మూడేళ్ల జైలు.. రూ.5లక్షల జరిమానా..
ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి అయితే కోర్టు వారికి 3 ఏళ్ల జైలు శిక్ష,రూ.5లక్షల జరిమానా విధిస్తారని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అంతేకాదు,ఒకవేళ ఇది రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధిస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంపై గానీ,ప్రభుత్వ అధికారులపై గానీ అనుచిత వ్యాఖ్యలు,దుష్ప్రచారం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సోఐడీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Recommended Video
ఖండిస్తున్న టీడీపీ...
మరోవైపు పూంతోట రంగనాయకి అరెస్టును టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. 66 ఏళ్ల వృద్దురాలిని కేసులు పెట్టి వేధిస్తారా అని ప్రశ్నిస్తోంది. ఆమెకు అండగా టీడీపీ కార్యకర్తలు ఫేస్బుక్లో పోస్టుల ద్వారా మద్దతు తెలుపుతున్నారు. రంగనాయకిని పలువురు టీడీపీ నేతలు కూడా పరామర్శించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఫోన్ చేసి.. న్యాయపరంగా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు.