ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ఒక్కటీ లేదు, 619కి పడిపోయిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 28,239 నమూనాలను పరీక్షించగా.. 67 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,077కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
ఒక్క రోజు వ్యవధిలో విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించినవారి సంఖ్య 7166కు చేరింది. గత 24గంటల్లో 54 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,81,292కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 619 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,36,44,086 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 2, చిత్తూరులో 17, తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 12, కడపలో 4, కృష్ణాలో 3, నెల్లూరులో 4, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 12,881 కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 11,987 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,06,56,845కు చేరింది. గడిచిన 24 గంటల్లో 101 మంది మరణించగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,56,014కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,37,342 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.