ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు: ఏయే జిల్లాలో ఎన్ని కేసులంటే.? విజయనగరంలో ఒక్క కేసూ లేదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దాదాపు పది రోజులుగా రాష్ట్రంలో 100 లోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, గడిచిన 24 గంటల్లో 30,620 నమూనాలను పరీక్షించగా.. 68 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు
తాజాగా నమోదైన 68 కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,760కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కర్నూలు జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 7162కు చేరింది.
ఏపీలో 814కు తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 106 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,80,784కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 814 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,34,84,025 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు.. విజయనగరంలో సున్నా..
ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి.. అనంతపురంలో 6, చిత్తూరులో 11, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 9, కడపలో 1, కృష్ణాలో 7, కర్నూలులో 2, నెల్లూరులో 7, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
దేశంలోనూ తగ్గుతున్న యాక్టివ్ కేసులు..
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,86,191కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,05,93,171గా ఉంది. కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 1,55,507కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,33,014 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఇప్పటి వరకు 75,05,010 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. మొదట ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయించగా, ఇప్పుడు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇస్తున్నారు.