ఎమ్మెల్సీలు ఏకగ్రీవం: నారా లోకేష్ సహా 5గురు టిడిపి, ఇద్దరు జగన్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఇక ఎన్నిక నిర్వహణ లేనట్లయ్యింది. అయితే, బుధవారం నామినేషన్ల పరిశీల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తం 7 దరఖాస్తులే రావడంతో ఇక ఎన్నిక నిర్వహణ లేనట్లయ్యింది. అయితే, బుధవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.
తెలుగుదేశం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్, బత్తుల అర్జునుడు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈళ్ల నాని, గంగుల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 9వ తేదీ ఉపసంహరణ గడువు ముగిశాక వీరిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు.
అర్ధరాత్రి బాబు నిర్ణయం: లోకేష్, బలరాం సహా ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
కాగా, ఈ నామినేషన్ల దాఖలులో చివరినిమిషంలో హైడ్రామా నడిచింది. సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్ధిగా గంగుల సతీమణి ఇందిరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి పోటీగా మంగళవారం తెలుగుదేశం కూడా మరో డమ్మీ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడింది.
చివరి నిమిషంలో ఇందిరారెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో తెలుగుదేశం కూడా డమ్మీ ఆలోచనలను విరమించుకుంది. దీంతో స్వీకరణ గడువు ముగిసేసరికి మొత్తంగా 7 నామినేషన్లే దాఖలయ్యాయి.