ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కోట్లలో టోకరా: కోల్కత వాసి అరెస్ట్, 50 లక్షలు స్వాధీనం
గుంటూరు:ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం గురించి తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసిన నౌకరి డాట్కమ్ ఓ మాయగాడికి కోట్లు సంపాదించి పెట్టే కల్పవృక్షంలా ఉపయోగపడింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన అమూల్య అనే వ్యక్తి ఈ వెబ్ సైట్ నే ఆసరాగా చేసుకొని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను దారుణంగా మోసగించాడు. ఇతడి బాధితుల్లో రాజధాని జిల్లాలు గుంటూరు,కృష్ణాతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగిన గుంటూరు అర్బన్ పోలీసులు డొంకంతా లాగి కీలక సూత్రధారితో పాటు బమరో ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
సోమవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు నిందితుల వివరాలు తెలిపారు. విజయవాడకు చెందిన షేక్ మహ్మద్ ఇమ్రాన్ తన తమ్ముడికి ఉద్యోగం కోసం నౌకరిడాట్కామ్లో దరఖాస్తు చేసి తన చరవాణి నంబర్ ఇచ్చాడు. అది చూసిన కలకత్తాకు చెందిన అమూల్య అనే వ్యక్తి తాను రైల్వేలో టి.సి, కమర్షియల్ క్లర్కు ఉద్యోగాలు ఇప్పిస్తానని...అయితే అందుకు రూ. 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఇమ్రాన్ తన తమ్ముడిని తీసుకొని కలకత్తా వెళ్లి రూ. 6 లక్షలు కట్టాడు.
వెంటనే అమూల్య అందులో నుంచి కమిషన్గా రూ. 30 వేలు తీసి ఇమ్రాన్కు ఇచ్చాడు. ఇంకా ఎవరైనా ఉంటే తీసుకువస్తే ఇలాగే రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు కమిషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ కమిషన్ లెక్కలు వేసుకున్న ఇమ్రాన్ ఇలా తేలిగ్గా డబ్బు సంపాదించ వచ్చనే దురాశతో తన దూరపు బంధువైన గుంటూరుకు చెందిన మొఘల్ సాహెల్ బేగ్కు ఈ విషయం చెప్పి అతడిని అమూల్యకు పరిచయం చేశాడు. ఆ తరువాత సాహెల్బేగ్ 10 మంది నిరుద్యోగులను తీసుకువచ్చి ఇమ్రాన్కు పరిచయం చేయగా, అతడు వీరందరిని కోల్కత తీసుకువెళ్లి రూ. 6 లక్షల చొప్పున కట్టించి కమిషన్ తీసుకున్నారు.
ఈక్రమంలోనే పొన్నూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పూసల కోటయ్యకు ఇమ్రాన్ పరిచయమయ్యాడు. తనకు తెలిసినవాళ్లు ఉంటే వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కట్టిస్తే కమిషన్ భారీమొత్తంలో వస్తుందని చెప్పాడు. ఇదేదో బాగా లాభసాటిగా ఉందని భావించిన కోటయ్య కొందరి చేత రూ. 2 నుంచి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు కట్టించి తన కమిషన్ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన వద్ద పనిచేస్తున్న పెదనందిపాడుకు చెందిన నగిరి నాగకుమార్తోపాటు అతనికి పరిచయం ఉన్న ఆళ్లవారిపాలెంకు చెందిన అమ్ముల నాగశేషగిరి, పొన్నూరుకు చెందిన షేక్ కరిముల్లా కలిసి మొత్తం 27 మంది చేత డబ్బులు కట్టించి వారందరూ ఆ కమిషన్ ను పంచుకున్నారు.
ఇలా ఈ ముఠా సభ్యులు 2016 నుంచి నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి డబ్బులు కట్టిస్తూ వచ్చారు. వీరందరికీ నమ్మకం కలిగించడానికి కలకత్తా తీసుకువెళ్లి రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అమూల్యను పరిచయం చేశారు. ఆ తరువాత 2012 సంవత్సరానికి చెందిన పాత రైల్వే నియామక పరీక్షపత్రాలు, ఓయంఆర్ పత్రాలు ఇచ్చి పరీక్ష రాయించారు. ఆ తర్వాత వారందరికి ఉద్యోగాలు వచ్చేశాయని రైల్వే కార్యాలయానికి తీసుకువెళ్లి నకిలీ నియామక పత్రాలు కూడా ఇచ్చారు. మూడు నెలలు తర్వాత ఉద్యోగంలో చేరవచ్చని మాయమాటలు చెప్పి తిప్పి పంపించివేశారు.
అయితే మూడు నెలలు కాదుగదా మూడు సంవత్సరాలవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఈక్రమంలో గుంటూరు రెడ్డిపాలెంకు చెందిన ప్రశాంత్ ఈ నెల 13వ తేదీన గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో సీఐ బాలమురళీకృష్ణ, ఎస్సైలు రాంబాబు, నాగుల్మీరా, నారాయణల బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఆ ముఠా సభ్యులు కేవలం రైల్వేలోనేకాకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్డీసీఏ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మొత్తం 48 మంది నిరుద్యోగులను మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 26 మంది బాధితుల వివరాలు సేకరించారు.
ఆ తరువాత ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 51.44 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అమూల్య కోసం కలకత్తాకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నట్లు ఎస్పీ విజయారావు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే మాయగాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ఎస్పీ విజయరావు ఈ సందర్భంగా హెచ్చరించారు.