చిన్నారులున్నారని తెలిసి వ్యథకు గురయ్యా: పవన్, పడవ ప్రమాదానికి కారణాలు!
రాజమహేంద్రవరం: పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి వద్ద జరిగిన పడవ ప్రమాదం మరిచిపోకముందే తూర్పు గోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం దాదాపు నలభై మందితో వెళ్తున్న పడవ గోదావరి నదిలో బోల్తాపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఏడుగురు నుంచి ఎనిమిది మంది వరకు గల్లంతయ్యారు. వీరిలో పాఠశాలల నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు విద్యార్థినులు, ఓ గృహిణి ఉన్నారు. మిగిలిన వారు బయటపడ్డారు. పశువుల్లంక నుంచి సలాదివారి పాలెంకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పడవ బయలు దేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అదుపు తప్పిన పడవ అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఢీకొట్టి ఒరిగిపోయింది.
దీంతో కొంతమంది వంతెన పునాదిపైకి దూకి ప్రాణాలు కాపాడుకోగా మరికొంతమంది నీటిలో మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలోని వంతెన నిర్మాణ కార్మికులు మరో పడవలో వెళ్లి కొందరిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు గల్లంతయ్యారు. కొంతమంది విద్యార్థులు పాఠశాల బ్యాగులు తగిలించుకోవడంతో వాటి ఆధారంగా రక్షించగలిగారు.
గల్లంతైన వారు వీరే.. పోలిశెట్టి వీరమనీషా (10వ తరగతి), పోలిశెట్టి అనూష (9వ తరగతి), పోలిశెట్టి సుచిత్ర (6వతరగతి), కొండేపూడి రమ్య (10వ తరగతి), సుంకర శ్రీజ (4వ తరగతి), సిరికోటి ప్రియ (8వ తరగతి), గెల్ల నాగమణి. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ రంగంలోకి దిగాయి.
ప్రమాదంపై చంద్రబాబు, జగన్, రఘువీరా, పవన్ దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పడవలో చిన్నారులు ఉన్నారని తెలిసి తీవ్ర వ్యథకు గురయ్యానని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. పడవ ప్రమాదం విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని, అందులో చిన్నారులు ఉన్నారని తెలిసి వేదనకు గురయ్యానని చెప్పారు.
గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని, వారు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకొంటున్నాని, కొన్ని నెలల కిందట జరిగిన వాడపల్లి పడవ ప్రమాదం మరువక ముందే గోదావరి నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని, జీవితాలను పణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితుల నుంచి లంక గ్రామాల ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, సురక్షితమైన, భద్రతా ప్రమాణాలతో కూడిన నదీ ప్రయాణాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కాగా, పడవలో ప్రయాణీకులతో పాటు పది బైకులను కూడా ఎక్కించారు. ఓ వైపు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మరోవైపు సామర్థ్యానికి మించి బరువు కూడా పడవ బోల్తా కారణమని చెబుతున్నారు. ఇటీవల వాడపల్లి వద్ద కూడా అధిక బరువు వల్లే ప్రమాదం జరిగింది. పైగా ప్రమాదానికి గురైన పడవకు ఎలాంటి అనుమతులు లేవు. కనీసం ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవు. ఈ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. బైకులు మీద పడటం వల్ల కూడా మరికొందరు విద్యార్థినులు గల్లంతయ్యారని తెలుస్తోంది.