ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం: రెండు నుంచి ఏడు: జిల్లాలే కాదు..వాటి సంఖ్యా పెంచేలా
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. నూతన సంవత్సరం కానుకగా.. జనవరిలో కొత్త జిల్లాలను తెర మీదికి తీసుకుని రావడానికి ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రత్యేకించి- రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పోలీస్ కమిషనరేట్లను పెంచడానికీ అవకాశం ఉంది. ఏపీ పోలీస్ వ్యవస్థలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.
రెండు నుంచి ఏడుకు
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పోలీస్ కమిషనరేట్లే ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలల్లో మాత్రమే పోలీస్ కమిషనర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య మూడింతలుగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు పోలీస్ కమిషనర్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అలాగే- పోలీస్ యూనిట్లను కూడా పెంచుతారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 పోలీస్ యూనిట్లు ఉండగా.. వాటి సంఖ్యను 29కు పెంచుతారని చెబుతున్నారు.
కొత్త కమిషనరేట్లు ఇవేనా?
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయాల సంఖ్యను పెంచాల్సి ఉంటుందంటూ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రస్తుతం సర్కిళ్లుగా కొనసాగుతోన్న ఎస్పీ కార్యాలయాల స్థాయిని కమిషనర్ కార్యాలయంగా బదలాయిస్తారని సమాచారం. కాకినాడ అర్బన్, నెల్లూరు అర్బన్, తిరుపతి అర్బన్, రాజమహేంద్రవరం అర్బన్, గుంటూరు అర్బన్ పరిధిని కమిషనరేట్ స్థాయికి పెంచుతారని అంటున్నారు. ఇప్పుడున్న విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లను పరిగణనలోకి తీసుకుంటే.. వాటి సంఖ్య ఏడుకు పెరుగుతుంది.
విశాఖలో మూడు పోలీస్ యూనిట్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 18 పోలీస్ యూనిట్లు ఉండగా.. వాటి సంఖ్య 29కు పెంచవచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం యూనిట్లను యధాతథంగా కొనసాగిస్తారు. విశాఖపట్నం యూనిట్ను మూడుగా విభజించే అవకాశం ఉంది. విశాఖ సిటీ కమిషనరేట్ పరిధిని యూనిట్గా గుర్తిస్తారు. కొత్తగా అరకు, అనకాపల్లి కేంద్రాలుగా పోలీస్ యూనిట్లు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, రాజమహేంద్రవరం పోలీస్ కమిషనరేట్, కాకినాడ కమిషనరేట్, అమలాపురం కేంద్రాలుగా యూనిట్లు ఏర్పడవచ్చు.
పశ్చిమలో రెండు
పశ్చిమ గోదావరిలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఏలూరు, నరసాపురంలల్లో వాటిని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. కృష్ణా జిల్లాలో కొత్త పోలీస్ యూనిట్లు ఉండకపోవచ్చు. ఉన్నవాటిని యధాతథంగా కొనసాగిస్తారు. గుంటూరు జిల్లాలో మూడు యూనిట్లు ఏర్పాటవుతాయి. జిల్లాల విభజన అనంతరం ప్రకాశం జిల్లాలో బాపట్ల, ఒంగోలు కేంద్రాల్లో కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండు చొప్పున పోలీస్ యూనిట్లు ఏర్పాటవుతాయని సమాచారం.
Recommended Video
బదిలీలపై నిషేధం..
కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతోన్న నేపథ్యంలో పోలీస్ శాఖలను బదిలీలను నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 10వ తేదీ నాడే డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాలు, రేంజ్ల పరిధిలో వివిధ స్థాయిల్లో పోలీసుల బదిలీలను నిలిపివేశారు. అంతర్గత బదిలీలపై ఆంక్షలను విధించారు. రైల్వేలు, సీఐడీ, ఇంటిలిజెన్స్, ఏపీఎస్పీ విభాగాలనూ దీని పరిధిలోకి తీసుకొచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ నిషేధం కొనసాగుతుంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యేంత వరకూ బదిలీలు ఉండబోవని ఆయన పేర్కొన్నారు.