బంధువే కాటేశాడు: గుంటూరులో మరో 'రేప్'!, నెల్లూరులోనూ అత్యాచారయత్న ఘటన!
తెనాలి: దాచేపల్లి అత్యాచార ఘటన మరవకముందే.. జిల్లాలో మరో మైనర్ బాలికపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో.. ఏడేళ్ల బాలికపై 25ఏళ్ల తాపీకూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలికి బంధువే కావడం గమనార్హం. కాగా, విషయం బయటకు పొక్కితే చంపేస్తానని చెప్పడంతో... 2,3రోజులు ఆ బాలిక తనలో తానే కుమిలిపోయింది. కూతురు నీరసంగా ఉంటుండటంతో తల్లి ఆమెను గట్టిగా నిలదీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరులో మరో దారుణం: బాలికపై తాపీకూలి అత్యాచారం..
అసలేం జరిగింది?:
చుండూరు మండలం మోదుకూరులో ఓ ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. ఎండాకాలం సెలవులు కావడంతో ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నాం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ల ఆశచూపి తన వద్దకు పిలిచాడు షేక్ నాగుల్ మీరా(25). షేక్ నాగుల్ తమకు బంధువే కావడంతో చిన్నారి అతని వద్దకు వెళ్లింది.
బాలికపై అత్యాచారం:
చాక్లెట్లకు ఆశపడి చిన్నారి అతని వద్దకు వెళ్లగా.. షేక్ నాగుల్ మీరా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి బాలిక నీరసంగా ఉంటోంది. ఇంట్లోనూ ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆమెను గట్టిగా నిలదీయగా.. షేక్ నాగుల్ తనపై అత్యాచారం చేసిన విషయాన్ని బయటపెట్టింది.
రాజకీయ ఒత్తిళ్లు:
బాలిక తల్లి సోమవారం చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.బాలికను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయన్న వాదన వినిపిస్తోంది. కొంతమంది రాజకీయ నేతలు ఇందులో జోక్యం చేసుకుని నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
నెల్లూరులో అత్యాచారయత్న ఘటన..:
నెల్లూరులోనూ మరో అత్యాచారయత్న ఘటన కలకలం రేపింది. గాంధీ గిరిజన కాలనీకి చెందిన 12ఏళ్ల చిన్నారిబహిర్భూమికి వెళ్లిన సమయంలో బండి శివయ్య అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన మరో మహిళ అతన్ని చూసి కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యాడు.
అదే రోజు సాయంత్రం స్థానిక దుకాణం వద్ద అతను కనిపించగా.. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. ఇంట్లోవాళ్లు అతన్ని గెంటేయడంతో.. 4రోజుల క్రితం గాంధీ గిరిజన కాలనీలోని తన బంధువు ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. ఘటనకు ముందు రోజు రాత్రి కూడా ఆరు బయట నిద్రిస్తున్న కొంతమంది మహిళల పట్ల శివయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు చెప్పారు.