ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 100 లోపే ఉంటోంది. గత 24 గంటల్లో 26,844 మందికి నమూనా పరీక్షలను నిర్వహించగా.. 70మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు
తాజాగా, నమోదైన 70 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,555కి చేరింది. గత 24గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7160 మంది కరోనా బారినపడి మరణించారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 115 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,80,478కి చేరింది.
ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు.. 917కు తగ్గిన యాక్టివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 917 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,33,94,460 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 1, చిత్తూరులో 24, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 8, కడపలో 4, కృష్ణాలో 9, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 1 కేసు నమోదైంది. ఇక కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసూ కూడా నమోదు కాలేదు.
దేశంలోనూ తగ్గుతున్న కరోనా కేసులు.. భారీగా కోలుకున్నారు..
మరోవైపు దేశంలోనూ కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా చోటు చేసుకోలేదు. గడిచిన 24 గంటల్లో దాదాపు 9వేల(9110) కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. తాజాగా 78 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,158కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1.43లక్షల(1,43,625)కు తగ్గాయి. గత 24 గంటల్లో 14,016 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మహమ్మారిబారినుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,05,48,521కి చేరింది. ఫిబ్రవరి 8న 687138 నమూనాలను పరీక్షించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 20,25,87,752కి చేరింది.