ముద్రగడపై రైల్వే శాఖ కేసు నమోదు?: ఇప్పటివరకూ 60 మందిపై కేసులు
తుని: కాపు ఐక్య గర్జన సమయంలో తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులపెట్టడంతో పాటు రైల్వే ఆస్తులకు భంగం కలిగించారనే ఆరోపణలపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు ఆందోళన కారులపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అనుమతి లేకుండా రైల్వే ప్రాంగణంలో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించడం నిషిద్ధమని, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినా సెక్షన్ 150, 151, 152 ప్రకారం కేసులు నమోదు చేస్తామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
వీడియో పుటేజ్ల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. కేసులు నమోదయ్యాక నిందితులను విచారణ నిమిత్తం ఆయా ప్రాంతాలకు తరలించడంలో ఆర్పీఎస్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ బృందాలు ఎవరి ప్రమేయాన్ని ఖాతరు చేయని రీతిలో పక్కా వ్యూహంతో నిందితులను అదుపులోకి తీసుకుంటాయి.
మరోవైపు తుని ఘటనలో రైల్వే శాఖకు సుమారు 30 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనను రైల్వే శాఖ సీరియస్గానే భావిస్తోంది. ఇందులో భాగంగానే సిఐడి, సిబిఐ బృందాలు కూడా తాజాగా రంగంలోకి దిగాయి. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తును ప్రారంభించాయి.
ఇప్పటికే ఆర్ఫీఎస్, జీఆర్పీ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. వీడియో టేపులు, పేపర్ క్లిప్పింగ్లు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన ఆస్తుల నష్టాలు, నిందితుల గుర్తింపు తదితర అంశాలపై సిఐడి అధికారులు విచారిస్తుండగా, కేంద్ర రైల్వే శాఖకు సంబంధించిన కేసులను సిబిఐ పరిశీలిస్తోంది.
రైల్వే పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఏ1గా చేర్చుతున్నట్టు తెలిసింది. వివిధ జిల్లాలకు సంబంధించి నిందితులపై పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేసిన అనంతరమే అరెస్ట్ల పరంపర ఉంటుందని సమాచారం.
మంగళవారం పొద్దుపోయే సమయానికి వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 60 మందిపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు వీడియో పుటేజ్లు, సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాలు, పత్రికలు, ఛానెళ్ళలో ప్రసారమైన దృశ్యాలను సమగ్రంగా పరిశీలించి, నిందితులను గుర్తిస్తున్నాయి.
పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన వీడియోగ్రాఫర్ల నుండి పుటేజ్లు, వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళ నుండి హింసాత్మక ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ వీడియో పుటేజ్ల ఆధారంగా కేసులను నమోదు చేస్తున్నారు.