ఏపీలో అత్యధిక పాజిటివ్ కేసులు అక్కడే: కోలుకుంటోన్న వారి సంఖ్య భారీగా: కొత్తగా మరో 73
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. మూడు రోజుల్లో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ సారి తీవ్రత కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా కోరల నుంచి కోలుకుంటోన్న వారు భారీగా నమోదవుతుండటం ఊరట కలిగించే అంశమని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1332కు చేరుకుంది.
Recommended Video
రాష్ట్రంలో కొత్తగా వెలుగు చూసిన 73 పాజిటివ్ కేసుల్లో అత్యధికం గుంటూరు జిల్లాలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 24 గంటల వ్యవధిలో మొత్తం 29 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఈ జిల్లాలో 283కు చేరింది. ఇందులో యాక్టివ్గా ఉన్నవి 219 కేసులే. ఇప్పటిదాకా గుంటూరు జిల్లాలో 59 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది మరణించారు.
కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇదివరకట్లా భారీగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కృష్ణాజిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-4, చిత్తూరు-3, తూర్పు గోదావరి-1, కడప-4, ప్రకాశం-4, శ్రీకాకుళం-1, విశాఖపట్నం-1, పశ్చిమ గోదావరి-2 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1332 కాగా.. ఇందులో 1014 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మిగిలిన వారిలో 287 మంది కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 31 మంది మరణించారు.
డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం 287 మంది ఇప్పటిదాకా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతపురం-17, చిత్తూరు-16, తూర్పు గోదావరి-12, గుంటూరు-59, కడప-28, కృష్ణా-32, కర్నూలు-43, నెల్లూరు-27, ప్రకాశం-23, విశాఖపట్నం-19, పశ్చిమ గోదావరి-11 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రోజురోజుకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్యలో పెరుగుదల కనిపించడం ఊరట కలిగించే అంశమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో మృతుల సంఖ్య 31 వద్దే ఆగిపోయిందని అంటున్నారు. ఈ సంఖ్య పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.