ఏపీలో 75% స్థానికులకే ఉద్యోగాలు ... హీట్ రాజేస్తున్న ట్వీట్ వార్
Recommended Video
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . అయితే ఇటీవలే జగన్ ఏపీలోని పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చానీయాంశం అయ్యింది. స్థానికత అంశంపై ఇప్పుడు ట్వీట్ వార్ నడుస్తుంది.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చే నిర్ణయం ... పారిశ్రామిక ప్రగతికి విఘాతం అని వ్యతిరేఖత
ఏపీలోని ఏ పరిశ్రమలో అయినా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో ఇక ఎక్కడ.. ఎవరు పరిశ్రమ పెట్టినా... 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. స్థానిక యువతకు ఇది సువర్ణావకాశమే . కానీ అలా ఇవ్వటానికి కొత్తగా వచ్చే పరిశ్రమలు ఆసక్తి చూపుతాయా ? అన్నదే అసలు ప్రశ్న . తమ ఊరిలో లేదా.. తమ జిల్లాలో పెట్టే పరిశ్రమలో ఉద్యోగాలన్నీ.. 75 శాతం అక్కడి వారికే ఇస్తే... వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆలోచన మంచిదే కానీ దీనివల్ల అసలు పరిశ్రమలే రాకపోతే.. ఉద్యోగాలెక్కడి నుంచి వస్తాయన్న వాదన తెరపైకి వస్తోంది. ఈ నిబంధన వల్ల అసలు పరిశ్రమలే రావన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ నిర్ణయం తప్పు అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది.
75% స్థానికత వలన సమాఖ్య వ్యవస్థకు విఘాతం అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ట్వీట్
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని కూడా వెలువరించింది. అయితే ఈ కథనంలో వచ్చిన క్లిప్పింగ్ను తీసుకుని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . 75% స్థానికత వలన సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని రాజ్యాంగం ప్రకారం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం వలన పెట్టుబడులు, ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పోస్ట్ చేశారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్.
మీ కామెంట్ తప్పని ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ రీ ట్వీట్
అయితే నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ట్వీట్కి సంబంధించిన ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పందించారు. మీరు చేస్తున్న కామెంట్లు పూర్తిగా అసమగ్ర సమాచారంతో ఉన్నాయని పీవీ రమేష్ పేర్కొన్నారు. ఏపీలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఈ చట్టం రూపొందించారని ఇందులో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదని ట్వీట్ చేసారు. అయితే దీనిపై అమితాబ్ కాంత్ స్పందిస్తూ ఇవి నేను మాట్లాడినవి కావని ఆ పత్రికలో చెప్పిన విషయాలే నేను పోస్ట్ చేసానని రీట్వీట్ చేసారు. ఏది ఏమైనప్పటికీ జగన్ తీసుకున్న నిర్ణయం ఎపీలోని యువతకు నచ్చినా అది ఫెడరల్ స్ఫూర్తి కాదు అన్న భావన వ్యక్తం అవుతుంది.