ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా.. 24 గంటల్లో 753 మందికి వైరస్, అనంతలో సింగిల్ డిజిట్..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో 10 వేలకు తక్కువగా కేసులు రాలేదు. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కేవలం 753 పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. ఇదీ కాస్త ఊరటనిచ్చే అంశం. గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగినట్లయ్యింది.
Recommended Video
24 గంటల్లో 43 వేల 44 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 753 మందికి కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. ఆ ఒక్క జిల్లాలో 216 కొత్తగా కేసులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 12 కేసుల చొప్పున వచ్చాయి. మిగతా జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో కేసులు వచ్చాయి. అయితే అనంతపురంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. కేవలం 4 కేసులు మాత్రమే వచ్చాయి.
753 కరోనా వైరస్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 54 వేల 764కి చేరింది. 8 లక్షల 29 వేల 991 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17 వేల 892 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 1507 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇక 13 మంది వైరస్ సోకిన వారు చనిపోయారని వివరించింది. వీరితో కలిపి మరణించిన వారి సంఖ్య 6 వేల 881కి చేరింది.