ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కోలుకుంటున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 10వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక, ఎక్కువ మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో 10వేల కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. తాజా కేసుల కంటే కూడా రికవరీ ఎక్కువగా ఉండటం గమనార్హం.
బేజారెత్తిస్తోన్న కరోనా: వర్షాలకు తోడుగా వైరస్: సీజనల్ వ్యాధులు: తెలంగాణపై ముప్పేటదాడి
భారీగా టెస్టులు చేసినా తక్కువ కేసులు..
గత 24 గంటల్లో 70,455 నమూనాలను పరీక్షించగా.. 7738 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో 57 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5349కి చేరింది. కాగా,
రోజూ 10వేల మందికి మించి కోలుకుంటున్నారు.
తాజాగా, 10,608 మంది కోలుకున్నారు. జిల్లాల వారీగా మరణాలను గమనించినట్లయితే.. కృష్ణాలో 8 మంది, అనంతపురంలో 7, చిత్తూరులో 7, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు చొప్పున, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణిచారు.
జిల్లాల వారీగా కొత్త కేసులు..
ఇక జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అత్యధికంగా తూర్పుగోదావరిలో నమోదయ్యాయి. అనంతపురంలో 539, చిత్తూరులో 794,తూర్పుగోదావరిలో 1260, గుంటూరులో 582, కడపలో 267, కృష్ణాలో 439,కర్నూలులో 275, నెల్లూరులో 444, ప్రకాశంలో 869, శ్రీకాకుళంలో 476, విశాఖపట్నంలో 342, విజయనగరంలో 446, పశ్చిగోదావరిలో 1005 కేసులు నమోదయ్యాయి.
తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,17,776 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 81,763 యాక్టివ్ కేసులున్నాయి. 5,30,711 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,302 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత మూడో స్థానంలో ఉంది.