షాకింగ్: ఏపీలో కరోనా విలయం, 7998 పాజిటివ్ కేసులు, 3 జిల్లాల్లో వెయ్యికి పైగా.. 61 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 8 వేల వరకు చేరింది. గురువారం 58,052 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా 7,998 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్ పరీక్షించగా.. 69 వేల 816 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,272 మందికి కరోనా వైరస్ ఉంది అని నిర్ధారణ అయ్యింది.
61 మంది మృతి..
గురువారం 5,428 మందికి వైరస్ తగ్గడంతో ఇంటికి పంపించేశారు. కోలుకున్న మొత్తం సంఖ్య 37,555కి చేరింది. గత 24 గంటల్లో 61 మంది కరోనా వైరస్తో చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 884కి చేరింది. వీరిలో తూర్పుగోదావరి జిల్లాలో 14, గుంటూరు, కర్నూలు జిల్లాలో 7, కృష్ణా , శ్రీకాకుళంలో 6, విశాఖపట్నం 5, విజయనగరంలో 5, చిత్తూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో 3, కడప, అనంతపురం జిల్లాలో ఒకర చొప్పున చనిపోయారని వైద్య శాఖ వెల్లడించింది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా 1391 కేసులు రాగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురం జిల్లాలో 1016 కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 904, పశ్చిమ గోదావరిలో 748 కేసులు రికార్డయ్యాయి. కోస్తాంధ్రలో గోదావరి జిల్లాల్లో, గుంటూరు, విశాఖపట్నంలో.. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా వైరస్ కేసులు వస్తున్నాయి.
నిన్న 6 వేలు..
నిన్న ఏపీలో 6045 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 65 మంది చనిపోయారు. ఇవాళ కూడా 61 మంది చనిపోగా.. దాదాపు 2 వేల వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో వైరస్ కేసులు పెరగడంతో భయాందోళన నెలకొంది. నగరాలు, పట్టణాల్లో లాక్ డౌన్ అమలు చేసి.. నిత్యావసర సరుకులు అందించే షాపులు కూడా నిర్ణీత సమయంలో మూస్తున్న పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతోంది.