తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ఎనిమిది మంది మృతి;ఏడుగురికి తీవ్రగాయాలు
తూర్పుగోదావరి:తూర్పు గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద టాటా మ్యాజిక్ వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
216 జాతీయ రహదారి వద్ద చేబ్రోలు గ్రామ శివారు బైపాస్ రోడ్డుపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. తొలుత ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా...తీవ్రంగా గాయపడిన వారిలో మరో ఇద్దరు పిఠాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...విశాఖ జిల్లా మాకవరం పాలేనికి చెందిన వీరంతా కాకినాడలో ఓ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అక్కడ ఆ వేడుకలో పాల్గొని బంధువులు అందరితో సంతోషంగా గడిపి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందన్నారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ టిప్పర్ ఢీకొట్టింది. ఘటన గురించి తెలిసిన వెంటనే క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. మరోవైపు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలాన్ని సీఐ అప్పారావు, ఎస్సై శివకృష్ణ పరిశీలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు.