కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం: క్వారీలో పేలుడు, 11మంది మృతి, పరుగులు తీసిన జనాలు
Recommended Video
కర్నూలు: జిల్లాలోని ఆలురూ మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11మంది వరకు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీప గ్రాస్థులు భయంతో పరుగులు పెట్టారు.
పేలుడు కారణంగా మంటలు అంటుకొని మూడు ట్రాక్టర్లు, ఓ లారీ, షెడ్డు దగ్ధమయ్యాయి. పేలుళ్లను పట్టించుకోలేదని మండిపడుతూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కాగా, ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తోంది. అక్కడే ఉన్న షెడ్డూలో ఇంకొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
మృతులు ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. పేలుడు ధాటికి హత్తిబెళగల్లో పలు ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దాదాపు పది ఇళ్లు కూలిపోయాయని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ దిగ్భ్రాంతి
క్వారీ పేలుడుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను, జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.