కలకలం:ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్...8 మంది విద్యార్థుల సస్పెన్షన్
విశాఖపట్నం:ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. అయితే ఈ విషయం బైటకు పొక్కకుండా చూడటంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎయు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో కొందరు జూనియర్లను, సీనియర్లలో కొందరు విద్యార్థులు ర్యాగింగ్ చేయటానికి ప్రయత్నించారు.
అయితే ఆ సమయంలో ఒక జూనియర్ విద్యార్థి సీనియర్లకు ఎదురుతిరగడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ క్రమంలో విషయం బైటకు పొక్కడంతో అధికారులు విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది సీనియర్లను హాస్టల్ నుంచి ఒక సెమిస్టర్పాటు సస్పెండ్ చేశారు. అయితే తరగతులకు హాజరయ్యేందుకు వీలు కల్పించారు. సస్పెండైన వారిలో ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు, ఆరుగురు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో నియామకాలు, పదోన్నతుల విషయంలో అధికారులు ప్రమాణాలు పాటించడం లేదని...తమ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద విద్యార్థులకు అత్యున్నత స్థాయిలో సాంకేతిక విద్య అందించడానికి ఏర్పాటైన ట్రిపుల్ ఐటీల్లో పాలనా వ్యవహారాలు నిబంధనలకు విరుద్దంగా ఉండటంతో పాటు ఇక్కడి ముఖ్య ఉద్యోగి తీరుపై ఆరోపణలు వస్తున్నాయి.
టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం ట్రిపుల్ఐటీలో ప్రవేశం పొందుతారు. మొదటి రెండేళ్లు పీయూసీ(ఇంటర్ తో సమానం)గా వ్యవహరిస్తారు. చివరి నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్యాబోధన సాగుతుంది. పీయూసీ విద్యార్థులకు మెంటార్లతో బోధిస్తారు. వీరికి సహాయ కులుగా హోం రూమ్ ట్యూటర్స్(కేర్ టేకర్లు) ఉంటారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లో చదువుకునే విషయంలో వీరు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
అయితే వీరిలో 90 శాతం మంది సాధారణ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) వంటివి చదివి, ఆరునెలలు, ఏడాది పాటు ఐ.టి.లో సర్టిఫికెట్ కోర్సు చదివినవారినే నియమించడం గమనార్హం. ట్రిపుల్ఐటీలు ఏర్పడిన మొదటి మూడేళ్లు ఒక్కొక్క ట్రిపుల్ ఐటీలో 2 వేల మంది చొప్పున విద్యార్థులను చేర్చుకున్నారు. అయితే నాలుగో ఏడాది నుంచి ఆ సంఖ్య వెయ్యికే పరిమితం చేశారు.
దీంతో హెచ్ఆర్టీలకు పనిభారం బాగా తగ్గిపోయింది. వీరిలో అత్యధికులు 2008లో ట్రిపుల్ఐటీలు ఏర్పడినప్పుడు చేరగా...మూడేళ్లకు ఒకసారి ఐటీ సపోర్టర్, టెక్నికల్ అసిస్టెంట్ పేర్లతో హోదాలు మారుస్తూ వారి జీతాలు పెంచుతూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు తాజాగా వారిని మెంటార్లుగా ప్రమోట్చేసి ఏకంగా బోధకుల స్థాయికే తీసుకెళ్లారు. మొత్తం హెచ్ఆర్టీలు సుమారు 42 మంది వరకు ఉండగా వీరిలో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న తొమ్మిది మందిని మెంటార్లుగా ప్రమోట్ చేశారు.
అయితే ఈ విషయంలో వివాదమేమీ లేకపోయినా...కేవలం ఏడాది సర్టిఫికెట్ కోర్సు ఉండి సాధారణ డిగ్రీలు ఉన్నవారికి పదోన్నతి కల్పించడంపై ట్రిపుల్ఐటీ బోధనా సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవడంతో పాటు అదో పెద్ద వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో టెక్నికల్ అర్హతలు ఉన్న మెంటార్లకు హోదా మార్చకపోవడం దానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఈ వ్యవహారాలన్నీ పరిశీలిస్తే ట్రిపుల్ ఐటీల్లో పాలనా తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలావుండగా ఆంధ్రయూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనను మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా పరిగణించారు. ఈ విషయమై ఏయూ వీసీతో మాట్లాడిన మంత్రి గంటా ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేయాలని వీసీని ఆదేశించారు. ర్యాగింగ్ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా...ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం విచారకరమని మంత్రి గంటా అన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సస్పెన్షన్ కు గురైన విద్యార్థుల సంఖ్య 13కి చేరింది.