అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్: లక్ష ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపు
అమరావతి: విశాఖపట్నం అనకాపల్లిలో శనివారం ఉదయం ఓ బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. గౌరపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల ఉదయ్ స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి బాలుడు కనిపించడం లేదు.
దీంతో కంగారుపడిన బాలుడి తల్లిదండ్రులు ఇరుగుపోరుగు వారి ఇళ్లలోను, బంధువుల ఇళ్లలో ఇలా పలు చోట్ల వెతికినా లాభం లేకుండా పోయింది. శుక్రవారం రాత్రి వరకు కూడా బాలుడు ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఉదయ్ తమ చెరలో ఉన్నాడని, రూ. లక్ష ఇస్తే విడిచి పెడతామని బెదిరించాడు.
దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కిడ్నాపర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసియడంతో చేసేదేమీ లేక బాలుడి తల్లిదండ్రులు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ చేసిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్ నా భర్తకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని రూ. లక్ష ఇస్తేనే వదిలిపెడతామని, లేదంటే చంపేస్తామని బెదిరించినట్లు కిడ్నాప్కు గురైన బాలుడి తల్లి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి మా అబ్బాయి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.
ఎవరిపైనైనా అనుమానం ఉందా? అని ప్రశ్నించగా ఎవరిపైనా తమకు అనుమానం లేదని ఆమె తెలిపారు.