ఇంతమందా?: శేషాచలంలో ఎర్రదొంగలు, పశువుల్లా లారీ నిండా..
తిరుపతి: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం మరో భారీ ముఠా రంగంలోకి దిగింది. స్మగ్లర్లు ఏకంగా ఓ లారీ నిండా కూలీలను దించేశారు. లారీ శేషాచలం అడవుల వైపు వెళ్తున్నట్టు గమనించిన తిరుపతి ఆంజనేయపురం అటవీశాఖ అధికారులు చెక్పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే సమయంలో నాలుగు బృందాలుగా బయలుదేరిన పోలీసులు.. లారీని చుట్టుముట్టారు. దీంతో ఎర్ర దొంగల ఆట కట్టించినట్టయింది.
సినీ ఫక్కీలో పట్టుకున్నారు:
శేషాచలం అడవుల్లోకి భారీ ఎత్తున స్మగ్లర్లు చొరబడుతున్నారని మొదట టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. అనుకున్నట్టుగానే.. 84మంది స్మగ్లర్లతో కూడిన ఓ లారీ శేషాచలం అడవుల వైపు వచ్చింది. సినీ ఫక్కీలో లారీని వెంబడించి.. ఎట్టకేలకు స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు.
తమిళనాడులోని వేలూరు నుంచి..
కొంతమంది స్మగ్లర్లు.. 84మంది కూలీలను మాట్లాడి తమిళనాడులోని వేలూరు, తిరువణ్నామలై జిల్లాల నుంచి వీరందరిని లారీలో తరలించినట్టు పోలీసులు గుర్తించారు. కూలీల వద్ద నుంచి గొడ్డళ్లు, రంపాలు, కొన్ని తినుబండారాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కూలీ ఇస్తామని చెప్పి కొంతమంది మేస్త్రీలు తమను ఇక్కడికి తీసుకొచ్చినట్టు పట్టుబడ్డవారు చెప్పారు.
స్మగ్లింగ్ కూలీల్లో విద్యావంతులు కూడా..
పేద వర్గాలకు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసి.. వారి ఎర్రచందనం కూలీలుగా మారుస్తున్నట్టు తాజా ఉదంతంతో బట్టయబలైంది. పట్టుబడ్డవారిలో ఇద్దరు ఉన్నత విద్య చదువుకున్న యువకులు కూడా ఉన్నారు.
సేలం యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గణితం చదువుతున్న ఏలుమలై అనే యువకుడికి ఏప్రిల్ నెలలో పెళ్లి నిశ్చయమైంది. తమది పేద కుటుంబం కావడంతో.. పెళ్లి ఖర్చులకు పనికొస్తాయన్న ఉద్దేశంతో రోజు రూ.800కూలీకి ఇక్కడిదాకా వచ్చినట్టు చెప్పాడు. అయితే కేరళలో పని ఉందని చెప్పి తనను ఇక్కడికి తీసుకొచ్చినట్టు వెల్లడించాడు.
ఎంకాం యువకుడు..:
ఇక ఎంకాం చదివిన మరో యువకుడు కూడా ఎర్రచందనం కూలీల్లో ఉన్నాడు. తిరువణ్నమలై జిల్లా సెంగం గ్రామానికి చెందిన గోవిందరాజులును రూ.500 రోజూ కూలీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు:
పట్టుబడ్డ 84మందిలో ఒకే ఇంటికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా ఉండటం గమనార్హం. . వెల్లూరు జిల్లా పలయపలయం గ్రామానికి చెందిన తిరుపత్తితో పాటు అతడి కొడుకు ఏలుమలై, అతడి పెద్ద అల్లుడి దేవేంద్రన్, చిన్న అల్లుడి ఏలుమలైలు కూలీ కోసం స్మగ్లింగ్ కు వచ్చినట్టు గుర్తించారు.
పశువుల్లా తరలించారు..:
పట్టుబడ్డ 84మంది వేర్వేరు బృందాలుగా విడిపోయి ఎర్రచందనం చెట్లను నరికివేయడానికి వచ్చారని పోలీసులు తెలిపారు. పశువులను తరలిస్తున్నట్టుగా 84మందిని ఒకే లారీలో టార్పలిన్ కప్పి తరలించారని చెప్పారు. ఇది అత్యంత హేయమైన చర్య అన్నారు. పట్టుబడ్డవారిలో చాలామంది పేదవాళ్లేనని అన్నారు.