ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, వందలోపే: అనంతలో సున్నా, రికవరీ మాత్రం రెట్టింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్గగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు, ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 27,861 నమూనాలను పరీక్షించగా.. తాజాగా 81 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాలవారీగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు గమనించినట్లయితే.. చిత్తూరులో 15, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 13, కడపలో 19, కృష్ణాలో 6, కర్నూలులో 4, నెల్లూరులో 1, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 7, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఏపీలో యాక్టివ్ కేసులు 2వేల లోపే..
గత 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 7141కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,77,212కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1713 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,26,04,214 పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలోనూ తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 5,48,168 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,788 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కి చేరింది. కొత్తగా 14,457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,11,342కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.44 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 145 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,52,419కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,08,012 యాక్టివ్ కేసులున్నాయి.