కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్యలో పోటీ పడుతోన్న కర్నూలు, గుంటూరు సరసన ఇక కృష్ణా జిల్లా కూడా చేరింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక కేసులు ఈ ఒక్క జిల్లాలోనే నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితులు ఎంతగా దిగజారాయనే విషయాన్ని చాటి చెబుతోంది.
కొత్తగా 81 పాజిటివ్ కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 835 వరకు మాత్రమే ఉండటం ఊరట కల్పిస్తోంది. మొత్తం 1097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 231 మంది కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి వారు డిశ్చార్జి అయ్యారు. మరో 31 మంది వైరస్ బారిన పడి మరణించారు.
కృష్ణా రికార్డు స్థాయిలో..
కృష్ణా జిల్లా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను నమోదు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా ఈ ఒక్కజిల్లాలోనే 52 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఒక్క జిల్లాను మినహాయిస్తే.. గుంటూరు, కర్నూలు సహా మరెక్కడా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. దీనితో కృష్ణా జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 177కు చేరుకుంది. డబుల్ సెంచరీకి చేరువగా వెళ్తోంది. కృష్ణా తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే 12 కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన చోట్ల ఎక్కడ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలను అందుకోలేదు.
త్రిపుల్ సెంచరీకి చేరువలో కర్నూలు..
కర్నూలు జిల్లాలో కొత్తగా కేవలం నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయినప్పటికీ.. ఈ జిల్లా టాప్ పొజీషన్లో కొనసాగుతోంది. త్రిపుల్ సెంచరీకి దగ్గరగా వెళ్తోంది. ఇప్పటిదాకా ఈ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 279. యాక్టివ్గా ఉన్న కేసులు 239 కాగా.. 31 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తొమ్మిది మంది మరణించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు మూడే. దీనితో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరుకోగా.. యాక్టివ్గా ఉన్నవి 177. 29 మంది డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
జిల్లాలవారీగా..
జిల్లాలవారీగా అనంతపురం-53, చిత్తూరు-73, తూర్పు గోదావరి-39, గుంటూరు-214, కడప-58, కృష్ణా-177, కర్నూలు-279, నెల్లూరు-72, ప్రకాశం-56, శ్రీకాకుళం-3, విశాఖపట్నం-22, పశ్చిమ గోదావరి-51 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. యాక్టివ్గా ఉన్న కేసుల్లో 239 కర్నూలు జిల్లాలో నమోదు అయ్యాయి. డిశ్చార్జి అయిన వారు, మరణించిన వారి సంఖ్య కూడా ఆ జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది. 31 మంది డిశ్చార్జి కాగా.. తొమ్మిది మంది మరణించారు.