గుంటూరులో దారుణం...వృద్ధురాలిపై అత్యాచారం, దోపిడీ:ఎపిలో కొనసాగుతున్నకీచక పర్వాలు
గుంటూరు:ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో కామాంధుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి...తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ కీచక పర్వం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు 81 ఏళ్ల పండు ముదుసలిపై అత్యాచారం చేయడమే కాదు ఆమెని తీవ్రంగా గాయపరిచి దోపిడీకి సైతం పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మాతృదినోత్సవం నాడే చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు (81) తన మనవడితో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆమె మనువడు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న గుండ్రాయి తీసుకొని తలపై మోదాడు. మళ్లీ అరుస్తే తలపై మోది చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.
అనంతరం నగదు,నగలు ఇవ్వాలని లేకపోతే చంపుతానని బెదిరించాడు. ఆమె వద్ద సంచిలో ఉన్న సుమారు రూ.18 వేల నగదు తీసుకొని పారిపోయాడు. ఆ తరువాత మనవడి ద్వారా బంధువులకు సమాచారం తెలిపిన ఆమె తనపై జరిగిన దారుణం గురించి పోలీసులకు తెలిపింది. దీంతో వృద్దురాలి ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారం, దోపిడీ జరిగినట్లు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. అగంతకుడి దాడిలో గాయపడిన వృద్దురాలిని 108 లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడింది తెలిసిన వారై ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనువడు ఇంట్లో లేడనే విషయం తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తన సొంత జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న కీచక పర్వాలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా స్పందించారు. వృద్దురాలిపై అత్యాచారం గురించి తెలిసిన ఆమె సోమవారం జిజిహెచ్ లో బాధితురాలని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..."వీళ్లకిదేం మాయ రోగమో అర్థం కావడం లేదు. సినిమాలు, టీవీ సీరియళ్ల ప్రభావమా? తినే తిండితో బలుపో? లేక పోయేకాలం దాపురించిందో.. ముక్కుపచ్చలారని చిన్నారులను, అమ్మమ్మ వయస్సు దాటిన వృద్ధులను వదలడం లేదు. పండు ముదుసలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మానవ మృగం భూమిపై సజీవంగా తిరగడానికి వీలు లేదు"...అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన మృగాడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని, అతడిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.