కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే, పాఠశాలలు ప్రారంభించిననాటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!
829 మంది ఉపాధ్యాయులకు కరోనా
ఇప్పటికే పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనాబారినపడటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోలన నెలకొంది. 9, 10 విద్యార్థికులకు నవంబర్ 2 నుంచి రోజు విడిచి రోజు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 829 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఉపాధ్యాయుల్లో పాజిటివిటీ రేటు 1.17 శాతంగా ఉంది.
575 మంది విద్యార్థులకు కరోనా
ఇక 95,763 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 575 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. విద్యార్థుల్లో పాజిటివిటీ రేటు 0.06 శాతంగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తప్పువేనని అధికారులు చెబుతున్నారు.
తక్కువ మందికే కరోనా.. పాఠశాలకు వచ్చినందువల్లేనా?
నవంబర్ 4న దాదాపు 4 లక్షల మంది పాఠశాలలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావడం వల్లే వారికి కరోనా వచ్చిందనడం సరికాదన్నారు. ఒక్కో తరగతి గదిలో 15 నుంచి 16 మంది విద్యార్థులే కూర్చుంటున్నారని తెలిపారు. ఒకవేళ పాఠశాలలు తెరవకపోతే ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు తమకెంతో ముఖ్యమని అధికారులు తెలిపారు. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటే వారికి బాల్య వివాహాలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
ఇది ఇలావుంటే, పాఠశాలలకు వెళ్లడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ కుమారుడు/కుమార్తెలను పాఠశాలలకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాగే పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కేసుల పెరుగుదల నమోదవుతుంటే.. పాఠశాలల నిర్వహణపై ఏపీ సర్కారు పునరాలోచించాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. కాగా, విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే తాము పాఠశాలను తిరిగి ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి సురేష్ చెబుతున్నారు.