ఏపీలో కొత్తగా 87 కరోనా పాజిటివ్ కేసులు: జిల్లాలవారీగా, 853 తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 30,527 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 87 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,88,692కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7,161 మంది మరణించారు. ఒక్క రోజు వ్యవధిలో 79 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటిపడినవారి సంఖ్య 8,80,678కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 853 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,34,53,405 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గమనించినట్లయితే.. అనంతపురంలో 3, చిత్తూరులో 12, తూర్పుగోదావరిలో 5, గుంటూరులో 4, కడపలో 6, కృష్ణాలో 6, కర్నూలులో 5, నెల్లూరులో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 18, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు భారతదేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటల్లో 6,99,185 కరోనా నమూనాలను పరీక్షించగా.. 12,923 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 108 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకు చోటు చేసుకున్న మరణాల సంఖ్య 1,55,360కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,42,562 యాక్టివ్ కేసులున్నాయి.