అందుకే టిడిపిలోకి: దేవినేని, 5జిల్లాల నుంచి జగన్కు ఎమ్మెల్యేలు షాక్!
విజయవాడ: అభివృద్ధిని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం అన్నారు. వైసిపి ఎమ్మెల్యేల జలీల్ ఖాన్ను చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, విపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు చూస్తున్నారని దేవినేని అన్నారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వైసిపి ఎమ్మెల్యేలు సముఖత చూపుతున్నారన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికోసం ఎమ్మెల్యేలు చంద్రబాబును కలస్తున్నారని తెలిపారు.
రాష్ట్రమంతా టిడిపి వైపు చూస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే సత్తా టిడిపికే ఉందన్నారు. కాగా, జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, టిడిపిలో ముస్లీం ఎమ్మెల్యేలు లేరు. దీంతో ఆయనను మంత్రి పదవి వరించే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.
అయిదు జిల్లాల నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యేలు
ఏపీవ్యాప్తంగా విశాఖ, కృష్ణా, ప్రకాశం, కడప, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల నుంచి వైసిపి ఎమ్మెల్యేలు ఆరు నుంచి తొమ్మిది మంది వరకు టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐదు జిల్లాలకు చెందిన ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్లో ఉన్నారని అంటున్నారు.
కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, ప్రకాశం నుంచి ముగ్గురు, నెల్లూరు నుంచి ఒకరు, విశాఖ నుంచి ఇద్దరితో టిడిపి నేతలు సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. వారిని చేర్చుకుంటే లాభమెంత, నష్టమెంత అని చంద్రబాబు బేరీజు వేసుకుంటున్నారని, లాభం ఉన్న వారినే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా నుంచి ఉప్పులేటి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ప్రకాశం జిల్లా నుంచి సురేష్, పోతుల రామారావు, కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, విశాఖ నుంచి సర్వేశ్వర రావు, ఎస్పీఎస్ నెల్లూరు నుంచి సునీల్, సంజీవ్ పేర్లు వినిపిస్తున్నాయంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. కనిష్టంగా ఆరుగురు గరిష్టంగా 9మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కవచ్చంటున్నారు.