ఊరించి ఉసూరుమనిపించారు.. తెలుగు వారంటే అంత చులకనా?
హైదరాబాద్/ అమరావతి: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు వారికి అవకాశాలు కల్పించే విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఆ పార్టీ నాయకత్వం ఊరించి, ఊరించి ఉసూరుమనిపించారు. ఆగస్టు 11వ తేదీన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి ముప్పవరపు వెంకయ్యనాయుడు తొలుత తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరిట కార్మిక శాఖ స్వతంత్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయతో రాజీనామా చేయించారు. వీరిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎంతో కీలకం. సీనియర్లు కూడా.
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తప్పుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు - విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు అవకాశం దక్కుతుందన్న అంశంపై పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. చివరకు హరిబాబు కుటుంబ సమేతంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో హరిబాబుకు అవకాశం దక్కినట్టేనన్న ప్రచారం వచ్చినా ఆచరణలో అంతా ఉత్తిదే అని మంత్రివర్గ విస్తరణ తర్వాత తేలిపోయింది.
వెదిరె లేదంటే మురళీధర్ రావు.. కాకపోతే కిషన్ రెడ్డి
ఇటు తెలంగాణ ప్రాంతంలో బండారు దత్తాత్రేయ స్థానంలో రాజస్థాన్ రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాంకు గానీ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీ మురళీధర్ రావుకు గానీ.. లేదా బీజేపీ తెలంగాణ అసెంబ్లీ శాసనసభా పక్ష నేత జీ కిషన్ రెడ్డిల్లో ఒకరికి చోటు దక్కనున్నదని కూడా వార్తలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలంటే తప్పనిసరిగా ఈ రెండు రాష్ట్రాల నేతలకు చోటు కల్పించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నదని మూడు రోజుల పాటు కమలనాథులకు అప్రకటిత మద్దతుదారులైన దినపత్రికలు, తెలుగు వార్తా టీవీ చానెళ్లు వార్తలు ప్రచురించాయి.. ప్రసారం చేశాయి.
బీజేపీ నాయకత్వం ప్రాథమ్యాలివి
క్యాబినెట్ విస్తరణ అంతా అయిపోయిన తర్వాత చూస్తే మాడు పగిలిపోయిందే తప్ప.. ఇటు తెలంగాణ వారికి గానీ.. అటు ఏపీ వారికి గానీ చోటు దక్కలేదు. కాకపోతే ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బీజేపీకి సురేశ్ ప్రభు నుంచి ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఊరట మాత్రమే మిగిలింది. కానీ ఆచరణలో బీజేపీ జాతీయ నాయకత్వం.. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం అనుసరించిన వ్యూహం అందరి ఊహలను తలకిందులు చేసింది. రాజకీయంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకే ప్రాధాన్యం కల్పించింది బీజేపీ. వాటితోపాటు త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నేతలకు అవకాశాలు కల్పించడం ద్వారా బీజేపీ తన ప్రాధమ్యాలేమిటో చెప్పకనే చెప్పింది.
కుల, ప్రాంత, రాష్ట్ర సామాజిక పరిణామాలకు అనుగుణంగా..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్తగా తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. స్వతంత్ర హోదా కలిగిన పని చేసిన నలుగురు సహాయ మంత్రులుగా కేబినెట్ మంత్రులుగా వీరిచేత రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలనాపరంగా పట్టుసాధించేందుకు అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లను మోదీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి విసృత్తంగా తీసుకెళ్లే దిశగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జోడి కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలను సైతం పరిగణలోకి తీసుకున్నారు.
ఆ రెండు రాష్ట్రాలకే కమలనాథుల ప్రాధాన్యం ఇలా
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్లకు ప్రమోషన్ లభించింది. నలుగురు మంత్రుల పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో వారిని ప్రమోట్ చేసి కేబినెట్ హోదా కల్పించినట్లు ప్రధాని కార్యాలయ (పీఎంవో) వర్గాలు చెప్పాయి. పార్టీ బలోపేతం, ఎన్నికల అంశాలపై బీజేపీ దృష్టిసారించే మంత్రివర్గ కూర్పు సిద్ధం చేసింది. ఇప్పటికే రాజీనామా చేసిన పాండేకు యూపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. కేంద్రమంత్రివర్గ తాజా విస్తరణలో పెద్దరాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, బీహార్లకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బీహార్లోనూ జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ మహకూటమికి గుడ్ బై చెప్పి భాజపా మద్దతుతో తిరిగి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.
దేశ రాజకీయాల్లో ఆ రెండు రాష్ట్రాలే కీలకం ఇలా
హిందీ ప్రాంతంలోని యూపీలో దేశంలో కెల్లా ఎక్కువగా లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయే మొత్తం 80 స్థానాలకు 73 స్థానాల్లో గెలుపొందింది. బీహార్లోనూ భారీ సంఖ్యలో స్థానాలను గెలుచుకున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాంటే ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాజా విస్తరణలో యూపీ, బీహార్ నుంచి తలా ఇద్దరు చొప్పున కేబినెట్లోకి తీసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి శివప్రతాప్ శుక్లా, సత్యపాల్సింగ్లకు స్థానం కల్పించారు. అదే విధంగా బీహార్ నుంచి అశ్విని కుమార్ చౌబే, రాజ్కుమార్సింగ్లకు చోటు కల్పించారు.