అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పెనువిషాదం: 9మంది మృతి
జిల్లా ఆస్పత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. రెండ్రోజుల్లోనే 9మంది రోగులు మృత్యువాతపడ్డారు.
అనంతపురం: జిల్లా ఆస్పత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. రెండ్రోజుల్లోనే 9మంది రోగులు మృత్యువాతపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో రోగులు చేరడంతోనే ఈ మరణాలు సంభవించాయని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథం బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దీర్ఘ కాలంగా గుండె, కిడ్నీ, తదితర జబ్బులతో బాధపడుతున్న రోగులే మృతి చెందారని చెప్పారు. జ్వరంతో వచ్చిన ఏ రోగీ మృతి చెందలేదని తెలిపారు. మృతి చెందినవారంతా 75ఏళ్ల పైవారేనని అన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి విషమించడంతో ఈ ఆస్పత్రికి రోగులను ఒకేరాత్రి తీసుకొచ్చారని తెలిపారు. అయితే, తాము అందరికీ వైద్యం అందించామని చెప్పారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉన్న రోగులు చనిపోయారని చెప్పారు. తమ ఆస్పత్రిలో వైద్యులు అందరూ అందుబాటులోనే ఉన్నారని, మందులు కూడా ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఉత్తమ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సిబ్బంది కొరతేమీ లేదని చెప్పారు.
కాగా, మృతుల బంధువులు మాత్రం సరైన వైద్యం అందకనే తమ వాళ్లు మృతి చెందారంంటూ ఆందోళనకు దిగారు. వైద్యులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని వారు చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఆరా
అనంతపురం ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి కామినేని స్పందించారు. ఘటనకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.