55మంది కోటీశ్వరులే, విజయసాయి సహా 13మందిపై కేసులు
న్యూఢిల్లీ: ఇటీవల కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వారిలో 96 శాతం మంది, అంటే ఎన్నికైన 57 మందిలో 55 మంది కోటీశ్వరులే. 13 మంది ఎంపీలు తమ పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పిన వారిలో వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా ఉన్నారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కొత్త రాజ్యసభ సభ్యుల పైన తాజా నివేదికలో పలు అంశాలు వెల్లడించింది. తాజా ఎంపీలలో ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ అత్యధికంగా రూ.252 కోట్ల ఆస్తులను అఫిడవిట్లో చూపించారు.
తర్వాత స్థానంలో రూ.212 కోట్లతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కపిల్ సిబల్, ఆ తర్వాత రూ.193కోట్లతో బీఎస్పీకి చెందిన సతీష్ చంద్ర మిశ్రా ఉన్నారు. అఫిడవిట్ల ప్రకారం ఇటీవల రాజ్యసభకు ఎంపికైన ఎంపీల్లో బీజేపీ ఎంపీ అనిల్ మాధవ్ దవేకు అతి తక్కువగా రూ.60లక్షల ఆస్తి ఉంది.
మరో బీజేపీ ఎంపీ రామ్ కుమార్ రూ.86లక్షల ఆస్తులను ప్రకటించారు. ఈ 57 మంది కొత్త ఎంపీల్లో 19 మంది రూ.కోటి అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నట్లు తెలిపారు. అధికంగా బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా రూ.193కోట్ల అప్పులు ఉన్నాయని ప్రకటించారు.
13 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొనగా, 12 శాతం మంది సీరియస్ క్రిమినల్ కేసులుగా పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ తరఫున 17, కాంగ్రెస్ నుంచి 9, అన్నాడీఎంకే నుంచి 4, ఎస్పీ నుంచి 7, బీజేడీ నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, బీఎస్పీ, టీడీపీ నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికయ్యారు. వైసిపి, ఎన్సీపీ, ఎస్హెచ్ఎస్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు.