ఏపీలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు: 3 లక్షలకుపైగానే, 88 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
3 లక్షల దాటిన కేసులు.. 88 మరణాలు..
కొత్తగా నమోదైన 9652 కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 88 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,820కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అత్యధిక యాక్టివ్ కేసులు.. 2 లక్షల మందికిపైగా కోలుకున్నారు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2,18,311 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29,61,611 టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
జిల్లాల వారీగా మరణాలు.. చిత్తూరులోనే అత్యధికం
తాజాగా, చిత్తూరులో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించాయి. చిత్తూరులో 14 మంది, ప్రకాశంలో 11 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, కర్నూలులో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఒక్కరు మరణించారు.
Recommended Video
తూర్పుగోదావరిలో అత్యధిక కేసులు.. రెండో స్థానంలో ఏపీ..
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 1396 కేసులున్నాయి. అనంతపురంలో 445, చిత్తూరులో 990, గుంటూరులో 895, కడపలో 755, కృష్ణాలో 281, కర్నూలులో 830, నెల్లూరులో 684, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 928, విజయనగరంలో 513, పశ్చిమగోదావరిలో 805 కేసులున్నాయి. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉండటం గమనార్హం. అత్యధిక పరీక్షలు నిర్వహించిన మూడో రాష్ట్రంగా ఏపీ కొనసాగుతోంది.