ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: తూర్పుగోదావరి, అనంతలో అత్యధిక కేసులు, యాక్టివ్ కేసుల్లో 2వ స్థానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,685 మందిని పరీక్షించగా.. 9742 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
Recommended Video
9వేల కేసులు.. 8వేల డిశ్చార్జులు..
తాజాగా నమోదైన 9742 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,19,296 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
చిత్తూరు, నెల్లూరులో అత్యధిక మరణాలు
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86 మంది మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున, అనంతపురంలో 8 మంది, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మరణించారు.
తూర్పుగోదావరి, అనంతపురంలో అత్యధిక కరోనా కేసులు
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1399 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1123 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 830, గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794, నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖపట్నంలో 835, విజయనగరంలో 428, పశ్చిమగోదావరిలో 919 మంది కరోనా బారినపడ్డారు.
యాక్టివ్ కేసుల్లో ఏపీ రెండో స్థానం..
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడోస్థానంలో ఉంది. అయితే, అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండోస్థానంలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6,15,477 కరోనా పాజిటివ్ కేసులుండగా, 1,56,608 యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో 3,49,654 కరోనా పాజిటివ్ కేసులుండగా, 53,860 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా 27లక్షలకుపైగా కరోనా కేసులుండగా, 6లక్షల 80వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.