సోదరి వరసైన 13 ఏళ్ల బాలికపై...15 ఏళ్ల బాలుడి అత్యాచార,హత్యా యత్నం:సెల్ ఫోనే కారణం!
విశాఖపట్టణం: విశాఖ జిల్లా మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన దేశంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. వరుసకు సోదరి అయిన ఒక 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల వయస్సున్న బాలుడు అత్యాచార యత్నం చేసిన ఘటన...అందుకు దారి తీసిన నేపథ్యం పోలీసులనే నివ్వెరపరిచింది. వివరాల్లోకి వెళితే...
నర్సీపట్నం రూరల్ సి.ఐ. రేవతమ్మ కథనం ప్రకారం...కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లికి చెందిన బాలుడు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో చేరాల్సివుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇతడికో స్మార్ట్ఫోన్ కొని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ బాలుడు ఎలాగో దీంట్లో నీలి చిత్రాలను చూడ్డానికి అలవాటు పడ్డాడు.
ఈ నేథ్యంలో ఈనెల 10 వ తేదీన కోటవురట్ల మండలం బీకేపల్లి సమీపంలోని పొలం పాక వద్ద ఐదుగురు పిల్లలు చేరారు. అందులో ఈ బాలుడికి సోదరి వరుసయ్యే బంధువుల అమ్మాయి, ఏడో తరగతి పాసైన పదమూడేళ్ల బాలిక కూడా ఉంది. సాయంత్రం వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో ఈ ఐదుగురిలో ముగ్గురు పిల్లలు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వీరున్న పొలం పాకలో ఉన్న తమ సిమెంట్ బస్తాలు తడుస్తాయని ఆ బాలిక వాటిపై పరదా కప్పేందుకని పాక లోపలికి వెళ్లింది.
అప్పటివరకు ఏదో ఆలోచిస్తున్న బాలుడు అదే అదనుగా ఆమె వెనుకే వెళ్లి కౌగలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ బాలిక పెద్దపెద్దగా కేకలు వేసింది. దీంతో భయపడిపోయిన ఆ బాలుడు బాలిక మెడకు చున్నీ బిగించి అరుపులు బైటకు రాకుండా గుంజకు అదిమిపెట్టాడు. అయితే ఆ బాలుడెవరనేది ఆమె వెనుదిరిగి చూసే అవకాశం లభించలేదు. దీంతో ఆ బాలిక ఊపిరి ఆడక స్పృహ కోల్పోయింది. ఆ తరువాత ఆ బాలుడు నేరుగా బాలిక ఇంటికి వెళ్లి మీ అమ్మాయిపై సిమెంట్ బస్తా పడిందని, అక్కడ పడిపోయిందని చెప్పాడు.
వారు ఆందోళనతో ఉరుకులుపరుగులు మీద సంఘటనా స్థలానికి వచ్చి ఆ బాలికను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి...ఆ తరువాత విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ నుంచి పోలీసులకు ఈ విషయమై సమాచారం అందింది. దీంతో పోలీసులు వెళ్లి బాలిక తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులు మళ్లీ పోలీసుల వద్దకు వచ్చి, తమకు ఫలానా బాలుడిపై అనుమానం ఉందని తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు సులువైంది. శనివారం ఈ బాలుడు వి.ఆర్.ఒ. వద్ద లొంగిపోయి నేరం అంగీకరించాడు.
ఈ సందర్భంగా నర్సీపట్నం రూరల్ సి.ఐ. రేవతమ్మ మాట్లాడుతూ...పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చి తల్లిదండ్రులు మురిసిపోతున్నారే తప్ప...వాటిలో పిల్లలు ఏం చూస్తున్నారో...ఆ తరువాత ఏమి చేస్తున్నారో పట్టించుకోవడం లేదన్నారు. ఈ బాలుడు నీలి చిత్రాలకు అలవాటు పడ్డం వల్లనే ఈ దారుణానికి ఒడిగట్టాడని...ఆ బాలుడిని జువైనల్ హోంకి తరలించామని చెప్పారు. బాలలు కావడంతో వారి వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.