బాబోయ్: దట్టమైన అడవిలో మిస్ అయిన నాలుగేళ్ల చిన్నారి..అడవి జంతువుల మధ్యే 56 గంటలు..!
కాకినాడ: చిన్న పిల్లలు రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో తప్పి పోవడం చూశాం. సంతలల్లో ఒక పెద్ద నగరానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కాస్త అజాగ్రత్తతో వ్యవహరించినప్పుడు చిన్నారులు వారినుంచి వేరుపడటం చూశాం. కొన్ని రోజుల తర్వాత తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటనలను కూడా చదివాం, చూశాం. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఓ నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి తిరిగి సేఫ్గా తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. అయితే ఇందులో ఏముంది, తప్పిపోయి తిరిగి చేరుకుంది కదా అని అనుకుంటే పొరపాటే. ఈ నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయింది బస్టాండులోనో లేక రైల్వే స్టేషన్లోనో కాదు... మరెక్కడ తప్పిపోయి తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
షాకింగ్ : ఏసీలో 40 పాము పిల్లలు.. గుండెలు అదిరిపోయే సీన్...
జూన్ 1న అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి
తూర్పుగోదావరి జిల్లాలో వలసదారులైన కుంజా సమ్రు రామ్ ఆయన భార్య జోగి వీఆర్పురం మండలం దర్బలంక గ్రామంలో నివాసముంటున్నారు. వారికి మంజు అనే నాలుగేళ్ల ఆడపాప ఉంది. లాక్డౌన్ వేళ సడలింపులు రావడంతో వారు తమ గ్రామమైన దర్బలంక నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉండే పెదమట్ల పల్లి అనే గ్రామంలో జరిగే సంతకు వెళ్లాలని జూన్ 1న భావించి తన కూతురుతో బయలుదేరారు. అయితే పెదమట్ల పల్లి గ్రామంకు చేరాలంటే ఓ దట్టమైన అడవిని వీరు దాటాల్సి ఉంటుంది. ఇక దట్టమైన అడవి గుండా బిడ్డ మంజుతో కలిసి వీరు కాలినడకన బయలుదేరారు. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూడగా చిన్నారి మంజు కనిపించలేదు.
అడవిలో నీరసించి పడిపోయిన చిన్నారి
కంగారు పడ్డ తల్లిదండ్రులు తాము వచ్చిన మార్గం అంతా వెతికారు. కానీ మంజు ఆచూకీ దొరకలేదు. వెంటనే వీఆర్ పురంకు చేరుకుని అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అడవిని జల్లెడ పట్టారు. వీరితో పాటు ఓ డాక్టరు కూడా ఉన్నారు. అంతకుముందు తప్పిపోయిన ఈ చిన్నారి అడవిలో ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి. జూన్ 3వ తేదీన అడవిలో నివసించే గిరిజనులు చెట్లు కొడుతుండగా వారికి నీరసించి పడిపోయిన చిన్నారి మంజు కనిపించింది. మంజును కాపాడిన గిరిజనులు వారి గ్రామానికి తీసుకొచ్చిపోలీసులకు సమాచారం అందించారు.
Recommended Video
56 గంటలు ఒంటరిగా...
అప్పటికే చిన్నారి కోసం వెతుకుతున్న పోలీసులు గిరిజనులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్నారు. వారితో పాటు ఉన్న డాక్టర్ చిన్నారి మంజు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉంటే మంజు తప్పిపోయిన అడవి చాలా దట్టమైనదని పోలీసులు చెప్పారు. అక్కడ క్రూర మృగాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. మంజు తప్పిపోయిన రోజున భారీ వర్షం ఈదురు గాలులు వీచాయని పోలీసులు తెలిపారు. కానీ ఈ చిన్నారి భయపడకుండా దొరికిందే తింటూ క్రూర మృగాల కంటపడకుండా ఉన్నిందంటే అది భగవంతుడి కృపనే అని చెప్పారు. దాదాపు 56 గంటల పాటు ఆ దట్టమైన అడవిలో ఒంటరిగా గడిపింది చిన్నారి మంజు. తమ బిడ్డను తమకు అప్పగించినందుకు గిరిజనులకు పోలీసులకు మంజు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.