పెళ్లి రద్దు: ఫొటోలు, వీడియోలు చూపిస్తానంటూ బెదరింపు, బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తనతో పెళ్లి కుదుర్చుకుని,
విశాఖపట్నం: విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తనతో పెళ్లి కుదుర్చుకుని, ఆ తర్వాత రద్దు చేసుకున్న తర్వాత ఓ సైనికోద్యోగిని నుంచి ఎదురైన వేధింపులతో ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఎలమంచిలి రూరల్ ఎస్సై చక్రధరరావు కథనం ప్రకారం.. గేగులగూడెం గ్రామానికి చెందిన అనపర్తి పావనీ ప్రియాంక (18) విజయవాడ నోవా కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమెకు 8 నెలల క్రితం రాంబిల్లి మండలం వెలుచూరు గ్రామానికి చెందిన మొల్లేటి నర్సింగరావు అనే సైనిక ఉద్యోగికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చితార్థం జరిగింది.
ఆ తరువాత అతని ప్రవర్తన బాగోలేదని తెలియడంతో ప్రియాంక తండ్రి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. కుమార్తె కూడా తండ్రి నిర్ణయాన్ని సమర్థించింది. అయితే నర్సింగరావు నిశ్చితార్థంలో తీసుకున్న ఫొటోలు, తర్వాత వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్నప్పటి ఫొటోలు, వీడియో చూపించి, నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకున్నా వీటిని చూపిస్తానని తరచూ ఫోన్ చేసి వేధించేవాడు.
రోజురోజుకూ అతని బెదిరింపులు పెరగడంతో ఆమె నెల రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది ప్రియాంక. కాగా, నర్సింగరావు బుధవారం మళ్లీ ఫోన్ చేసి వేధించడంతో ప్రియాంక తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక మరణంతో ఆమె కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.