ప్రేమే ప్రాణం తీసిందా: బీటెక్ విద్యార్థి హత్య కలకలం
విశాఖపట్నం: నాలుగు రోజుల కిందట కిడ్నాపైన ఇంజినీరింగ్ విద్యార్థి శవమై కనిపించిన ఘటన విశాఖపట్నం జిల్లాలో కలకలం రేపుతోంది. శుక్రవారం కశింకోటలో జరిగిన వివాదంలో కొంతమంది యువకులు ఇంజినీరింగ్ చివరి చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థిని తీవ్రంగా గాయపరిచారని, అప్పటి నుంచి కనిపించడం లేదని మృతుడి బంధువులు కశింకోట పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు కింద పోలీసులు విచారణ చేపడుతున్న తరుణంలో సోమవారం సాయంత్రం అనకాపల్లి సమీపంలో శారదానది వద్ద విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. అగనంపూడిలో దానబోయినపాలెంకి చెందిన దానబాల రామునాయుడు, సత్యవతిలకు ప్రదీప్ ఒక్కగానొక్క కుమారుడు. మాకవరపాలెంలో అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రదీప్ చివరి సంవత్సరం ట్రిపుల్ఈ చదువుతున్నాడు. ఇదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కశింకోటకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడన్న అక్కసుతో విద్యార్థిని కుటుంబీకులు కశింకోట వచ్చిన ప్రదీప్తో పాటుగా ఇతని స్నేహితుడు తులసీరావును గాయపరిచారు.
ఈ తరుణంలో తులసీకుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఎంతకీ తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ప్రదీప్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా జరిగిన విషయాన్ని తులసీకుమార్ వీరికి చెప్పాడు. దీంతో శనివారం కశింకోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. ఆదివారం ఉదయం ప్రదీప్ కుటుంబీకులతో పాటుగా దానబోయినపాలెం గ్రామస్థులు పోలీస్స్టేషన్కు వచ్చి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
సమగ్ర విచారణ జరిపి తమ కుమారుడి ఆచూకీ తెలిసేలా చేయాలని కోరగా దీనిపై కశింకోట ఎస్సై తగిన విధంగా స్పందించలేదని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ప్రదీప్ను కొట్టినవారికి ఎస్సై వత్తాసు పలికి కేసు నీరుకార్చేలా వ్యవహరించారన్నారు. ఆదివారం ఉదయం నుంచి తాము పోలీస్స్టేషన్లో ఉంటే మధ్యాహ్నం వరకు ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.
చివరికి స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు వైజాగ్సాయి, సాకేత్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సోమవారం ఉదయం రమ్మని చెప్పారని అన్నారు. ఈ కేసులో పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్ల తమ కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని ప్రదీప్ తల్లిదండ్రులు రామునాయుడు, సత్యవతి, బంధువులు ఆరోపించారు.
నిందితులందర్నీ అరెస్ట్ చేసిన తర్వాతే మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.