నగరిలో రోజాకు పెద్ద షాక్ ... రోజాను సన్మానానికి పిలిచి మరీ అవమానించిన స్థానిక నేతలు
నగరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్గత కలహాలు ముదిరి పోయాయా? నగిరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా కే నగరి నేతల తీరు తలనొప్పిగా మారిందా ? అంటే అవుననే చెప్పాలి.
వైసిపి నాయకురాలు గా, నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా సెల్వమణి కి నగరి నేతలు దిమ్మదిరిగే షాకిచ్చారు. సన్మానం చేస్తామని పిలిచి అవమాన చేశారు. సన్మాన కార్యక్రమంలో రచ్చ రచ్చ చేశారు.
Recommended Video
మంత్రిగా చాన్స్ ఇస్తారనుకుంటే ఏపీఐఐసీ చైర్మన్ గా నగరి ఎమ్మెల్యే రోజా ..
రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్న రోజాకు వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వస్తుందని అందరూ భావిస్తే, జగన్ రోజా కు మొండిచెయ్యి ఇచ్చారు. ఇటీవల జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో రోజా వైసీపీ అగ్రనేతలపై అలకబూని సైలెంట్ గా ఉంది . ఆ తరువాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించడంతో మెత్తబడిన రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా పనిచేస్తున్నప్పటికీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదన్న బాధ రోజాకు ఇప్పటికీ ఉంది. అయినా ఆ బాధను దిగమింగుకుని ఇటీవలే ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతల్ని స్వీకరించారు రోజా.
ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు సన్మానం చేస్తామని ఆహ్వానించిన నగరి నేతలు .. సన్మాన సభలో ఘర్షణ
అయితే ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే అయిన రోజాను సన్మానించాలని భావించారు నగరి లోని వైసీపీ నేతలు. ఇక అందుకోసం నగరి నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోజాతో పాటు భర్త సెల్వమణిని కూడా ఊరేగింపుగా సన్మాన సభకు తీసుకువచ్చారు. ఒకరి వెంట ఒకరిని వేదిక మీదకు ఆహ్వానించారు. ఇంత వరకు బాగానే ఉన్నా స్థానిక నేతల్లో కొందరిని వేదిక పైకి పిలిచి, మరికొందరిని వేదికపైకి పిలవలేదు అంటూ స్థానిక నాయకులు రోజాతో గొడవ పడడం నగరి నియోజక వర్గంలో నేతల మధ్య ఉన్న విభేదాలను చెప్పకనే చెపుతున్నాయి.ఇక రోజా సన్మాన కార్యక్రమం చూడటానికి వచ్చిన వారు సైతం సొంత పార్టీ నేతల గొడవతో షాక్ తిన్నారు.
రోజాతో గొడవకు దిగిన నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ .. షాక్ తిన్న రోజా
రోజా సన్మాన కార్యక్రమం లో నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్ వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చి కేజే కుమార్ రోజాతో గొడవకు దిగారు. రోజా తాను చేసిన సహాయాన్ని మరిచిపోయిందని, తన కారణంగానే రోజా వైసీపీలోకి వచ్చిందని, తన అండతోనే ఎమ్మెల్యేగా గెలిచిందని మండిపడ్డారు. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరిలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, తమ వంటి వారిని పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని, ఓ కులం ఓట్లతోనే మీరు గెలుపొందలేనది వాదనకు దిగడం పలువురిని షాక్ కు గురి చేసింది. ఉన్నట్టుండి నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్ వర్గీయులు ఎదురుతిరగడం నగరిలో రోజాకు పెద్ద షాకే నని చెప్పక తప్పని పరిస్థితి.