నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం: చిత్రహింసలు, మర్మాంగంపై వాతలు
విశాఖపట్నం: నగరంలోని గాజువాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై సమీప బంధువు దాష్టీకానికి పాల్పడ్డాడు. అతడి చెయ్యి విరగ్గొట్టి, మర్మాంగంపై వాతలు పెట్టాడు. దీనిపై గుడివాడ పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు.
ఘటన జరిగింది గాజువాకలో కాబట్టి, అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆమెకు సూచించారు. దీంతో బాలుడి తల్లి మీడియాను ఆశ్రయించింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మన్నం లక్ష్మి రెండేళ్లుగా భర్తకు దూరంగా విశాఖపట్నంలో ఉంటున్నారు.
ఆమెకు ఆశ్రయం ఇస్తామని చెప్పిన సమీప బంధువు అనిల్.. తనలోని శాడిజాన్ని బాలుడిపై చూపించాడు. ఆమెను పనిలో కుదిర్చిన అనిల్.. తన వద్దే బాలుడిని ఉంచుకుంటానని చెప్పాడు. దీంతో ఆమె బాలుడిని అనిల్ వద్దే ఉంచింది.
15 రోజుల తర్వాత వచ్చి చూడగా తన కుమారుడిపై తీవ్ర గాయాలున్నాయని బాలుడి తల్లి తెలిపింది. బాలుడి చెయ్యి విరగ్గొట్టి, వాతలు పెట్టి ప్రత్యక్ష నరకం చూపించాడని చెప్పింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని కోరారు.