నోటిదురుసు, దాడి: చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్పై దెందులూరు పోలీస్టేషేన్లో కేసు నమోదైంది. దేవరపల్లి పోలీస్టేషన్ ఏఎస్ఐ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు
పశ్చిమగోదావరి: దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్పై దెందులూరు పోలీస్టేషేన్లో కేసు నమోదైంది. దేవరపల్లి పోలీస్టేషన్ ఏఎస్ఐ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్బాబు తెలిపారు.
దేవరపల్లిలో అమ్మవారి జాతర జరుగుతుండటంతో ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు దెందులూరు మండలం సింగవరం కూడలిలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు. ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులు, ఇద్దరు సీపీవోలు అక్కడ విధుల్లో ఉన్నారు.
ఆదివారం రాత్రి వాహనాలు దారి మళ్లిస్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే అకారణంగా తమను దుర్భాషలాడంతో పాటు సీపీవోలపై దాడి చేశారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కాగా, గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో కూడా ఎమ్మెల్యే ప్రభాకర్ పాత్ర ఉందని ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో ఎమ్మార్వో వనజాక్షితో వేదికను పంచుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని ప్రకటించారు. అంతేగాక, ఎమ్మార్వో చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.