జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు. జర్నలిస్టు హత్యపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సీరియస్ అయిన విషయం తెలిసిందే.. జర్నలిస్టులపై దాడులను ఉపేక్షించేది లేదని.. సత్యనారాయణ హత్య కేసును లోతైన దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశించారు.
రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి పత్రిక తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారయణను గుర్తు తెలియని వ్యక్తులు తుని మండలం ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో కత్తులతో నరికి హత్య చేశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుల చేతిలో సత్యనారాయణను హత్యకు గురయ్యారు. కాగా సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు హత్యపై పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. హత్యపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇక హత్య సంఘటనను జననేత అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. హత్యను ఆటవిక చర్యగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నమా లేక ఇతర అటవీ ప్రాంతంలో ఉన్నామా అనే అనుమానాలు కల్గుతున్నాయని అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని, ఆయన డిమాండ్ చేశారు.