అనంతపురం సరిహద్దు గ్రామాల్లో కలకలం: పొలాల్లో దిగిన ఛార్టెడ్ విమానం: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. !
అనంతపురం: అనంతపురం జిల్లాల్లో సోమవారం కలకలం చెలరేగింది. జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో ఓ ఛార్టెడ్ ప్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. పెద్ద శబ్దం చేస్తూ ఈ తేలిక పాటి విమానం కిందికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం గానీ, ఆస్తి నష్టం గానీ చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఛార్టెడ్ ఫ్లైట్లో ఉన్న వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
మహిళలపై మీ మైండ్సెట్ మార్చుకోండి: కేంద్రానికి సుప్రీం చురకలు: ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్కు ఓకే
జిందాల్ స్టీల్ ప్లాంట్కు చెందిన తేలికపాటి విమానం..
అనంతపురం జిల్లా, కర్ణాటక సరిహద్దుల్లోని కల్యాణదుర్గం సమీప గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా తోర్నగల్లోని జిందాల్ ఉక్కు కర్మాగారానికి చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులతో ఈ విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లింది. సింగిల్ ఇంజిన్ గల సైర్సస్ రకానికి చెందిన విమానం అది.
ఇంధన ట్యాంకు ఖాళీ..
బెంగళూరు నుంచి బయలుదేరిన ఈ తేలికపాటి విమానం బళ్లారిలోని జిందాల్ ఫ్యాక్టరీ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన రన్వే దిగాల్సి ఉంది. మార్గమధ్యలో ఈ విమానంలో ఇంధన ట్యాంకు ఖాళీ అయింది. అప్పటికి ఇంకా బళ్లారికి వెళ్లడానికి వాయు మార్గంలో కనీసం 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉండటం, గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన ఇంధనం లేకపోవడాన్ని గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యారు. కల్యాణదుర్గం సమీప గ్రామాల్లో పొలాల్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
రక్షణగా పోలీసులు..
పెద్ద శబ్దం చేస్తూ విమానం కిందికి దిగడాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. కల్యాణదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు ఉద్యోగులు రోడ్డుమార్గం గుండా బళ్లారికి బయలుదేరి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి నిపుణులను పిలిపించినట్లు తెలుస్తోంది.