వేటగాళ్ల అమానుషం: ఆవు నోటిలో పేలిన నాటుబాంబు, తీవ్ర రక్తస్రావం
చిత్తూరు: ఇటీవల కాలంలో మూగ ప్రాణుల మీద జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగానే అమానుషంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇతర కారణాలతో మూగ జీవాల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ దారుణ ఘటన చోటు చేసుకుంది.
Recommended Video
పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వాహకులు గో పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ అటవీ వన్య మృగాల కోసం నీళ్లు, ఆహారాన్ని ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ఆవాసంగా ఉండేలా ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ప్రాంతంలో కొందరు అక్కడికొచ్చే వన్యప్రాణులను వేటాడేందుకు నాటు బాంబులను, తుపాకులను ఉపయోగిస్తున్నారు. కాగా, ఈ క్రమంలో గో పీఠానికి చెందిన ఓ ఆవు సదరు వేటగాళ్లు పెట్టిన నాటు బాంబును చూసింది. అయితే, అదేదో తినే పదార్థం అనుకుని నోటితో కొరికింది.
దీంతో ఒక్కసారి ఆ నాటుబాంబు పేలడంతో ఆవు దవడ కింది భాగం పూర్తిగా దెబ్బతింది. తీవ్ర రక్తస్రావమవుతున్న ఆవుకు స్థానిక డాక్టర్లు చికిత్స అందించారు. ఇలాంటి నాటుబాంబులతో పశువులకేకాకుండా మనుషులకు కూడా ముప్పేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాటుంబాబులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ఇటీవల కేరళ రాష్ట్రంలో ఓ గర్భిణి ఏనుగుకు పేలుడు పదార్థాలను నింపిన పండును తినిపించడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే రాష్ట్రంలో ఓ కుక్క మూతిని టేపులతో కట్టేయడంతో.. ఆ కుక్క సుమారు 20 రోజులపాటు ఆహారం తీసుకోకుండా బలహీనంగా తయారైంది. గమనించిన జంతు ప్రేమికులు టేపును తీసేసి, ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆ కుక్క బతికింది. తాజాగా, తెలంగాణలో ఓ కోతిని కొందరు దుర్మార్గులు దారుణంగా ఉరివేసి చంపేసిన ఘటన వెలుగుచూసింది.