ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్: ఆయేషా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
దర్యాప్తు నివేదికను ఏప్రిల్ 20 లోగా నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని, పూర్తయ్యేంత వరకు విచారణలో పాల్గొనే పోలీసు అధికారులను మార్చవద్దని స్పష్టం చేసింది. సిట్ నేతృత్వంలో దర్యాఫ్తు జరగాలన్నారు.
తమ కుమార్తె హత్య కేసులో అసలు దోషిని పట్టుకునేందుకు కేసును పునర్విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం అన్నారు. తన కూతుర్ని చంపిన అసలు దోషులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
హైకోర్టు ఆదేశాలతో వారికి తప్పక శిక్షపడుతుందన్న విశ్వాసం తమకు ఉందన్నారు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబుకు సంబంధం లేదని తాము తొలి నుంచి చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదని, అమాయకుడిని దోషిగా తేల్చే ప్రయత్నం చేశారన్నారు.
కేసు విచారణలో జోక్యం చేసుకున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నేరస్తులను తప్పించిందన్నారు. ఆయేషా హత్య కేసులో అసలు ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు.