శ్రీకాళహస్తిలో తొక్కిసలాట, మహిళకి తీవ్ర అస్వస్థత: భక్తులను కాపాడి కానిస్టేబుల్ మృతి
చిత్తూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహాస్తిలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సోమవారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉదయం నుంచే భారీగా భక్తులు తరలివచ్చారు. ఒక్కసారిగా గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
తొక్కిసలాటలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెతోపాటు పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆలయ అధికారులు, పోలీసులకు మధ్య సమన్వయం లోపించిన కారణంగానే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. క్యూలైన్లను సరిగా నియంత్రించకపోవడం వల్లే భక్తులు గాయపడాల్సిన పరిస్థితి ఎదురైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఆలయ అధికారులు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కొందరు స్థానిక భక్తుల వల్ల ఇబ్బందులు స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
భక్తులను కాపాడి ప్రాణాలు వదిలిన కానిస్టేబుల్
హైదరాబాద్ నగరంలోని బహదూర్ పురాలోని శివాలయంలో భారీగా భక్తులు తరలిరావడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఆలయంలో ఓ విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తులు పరుగుపెట్టారు. కాగా, భక్తులను కాపాడిన శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శ్రీనివాస్ బహదూర్ పురా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడిన శివాలయాలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. పరమశివుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.
శ్రీశైలంలో..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
పంచరామాలు..
శివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పరమశివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం, కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్, మహబూబ్నగర్, నల్గొండతోపాటు అన్ని జిల్లాల్లో శివాలయాలను దర్శించుకుంటున్నారు భక్తులు.