ఓ రైతు పంట పండింది .. విలువైన వజ్రం దొరికింది
కలిసిచ్చే కాలం ఉంటే ఎక్కడ ఉన్నా అదృష్టం వెతుక్కుంటూ వస్తుందంటారు . అలాగే ఒక రైతుకు అదృష్టలక్షి వజ్రం రూపంలో తారసపడింది. ఇటీవల కర్నూలు జిల్లాలో గొర్రెల కాపరికి , అలాగే ఒక వ్యవసాయ కూలీకి వజ్రాలు దొరికాయి. ఇక తాజాగా అనంతపురం జిల్లాలో ఒక రైతు పంట పడింది . పొలంలో కోటి రూపాయల విలువైన వజ్రం దొరికింది.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో ఒక రైతుకు వజ్రం దొరికింది . నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులో ఊటకల్లుకువెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇక ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడన అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కర్నూలు , అనంతపురం జిల్లాలలో వజ్రాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో రైతులు సేద్యం పనులు మొదలు పెట్టారు .ఇక రైతు దుక్కి దున్నుతున్న సమయంలో వజ్రం తళుక్కుమంది.
నాగలితో భూమిని దున్నడంతో ఓ వజ్రం ఆ రైతుకు లక్కీగా కనిపించింది . గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వజ్రాల వ్యాపారి తక్కువ ధర ఇస్తానని చెప్పటంతో బేరం కుదరలేదు. అక్కడ ధర వద్ద తేడా వచ్చింది. దీంతో గుత్తి ఆర్ఎస్లోని ఓ వ్యాపారికి రూ.30 లక్షలకు ఆ విలువైన వజ్రాన్ని విక్రయించినట్లు తెలిసింది. అయితే ఆ వజ్రం రూ.కోటికి పైగా ధర ఉంటుందని సమాచారం.
మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు సమాచారం . ఇక తొలకరి సీజన్ లో అనంతపురం , కర్నూలు జిల్లాలలో వజ్రాల వ్యాపారులు స్థానిక ప్రజలను మోసం చేస్తూ అతి తక్కువ ధరలకు అత్యంత విలువైన వజ్రాలను కొనుగోలు చెయ్యటం పరిపాటిగా మారింది.