ఓ తాగుబోతు దాష్టికం : భర్తను బయటకు నెట్టి మరీ.. ఆ ఇల్లాలిపై..
మదనపల్లె : పొద్దంతా కూలీకి వెళ్లడం.. సాయంత్రమవగానే వచ్చిన డబ్బులతో తాగి తంథానా ఆడడం.. చాలామంది వ్యక్తులకు ఓ అలవాటుగా మారిపోయింది. పొట్టకూటి కోసం సంపాదించే డబ్బులను తాగడానికి తగిలేసి..! ఆపై ఇంట్లో వాళ్లపై విరుచుకుపడడం.. ఉన్నామా? లేమా? అన్నట్లుగా సాగుతున్న కుటుంబ జీవనాన్ని బజారుకెక్కించడం చాలా మంది తాగుబోతులకు పరిపాటిగా మారిపోయింది.
ఇదే తరహాలో ఓ తాగుబోతు చేసిన నిర్వాకం చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన కోనేటి భాస్కర్ అనే వ్యక్తి.. మద్యం మత్తులో వేరే ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడితో ఆగకుండా.. ఆ ఇల్లాలి భర్తను, కుమార్తెను బయటకు నెట్టేసి గడియపెట్టాడు. అనంతరం ఆ ఇల్లాలిపై అత్యాచారం చేయడానికి యత్నించగా.. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ కొడవలితో తిరగబడింది.
కొడవలి దాడిలో భాస్కర్ స్పృహ తప్పి పడిపోగా.. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి స్థానిక వైద్యులు సూచించినట్లు సమాచారం. దాడి అనంతరం బాధిత మహిళ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.