పాసవలేదని విద్యార్థి ఆత్మహత్య: ప్రొఫెసర్ దూషించారని..
అనంతపురం/కృష్ణా: పరీక్షలో పాసవలేదని మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మద్దన్నచెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది.
మద్దన్నచెరువుకు చెందిన రఘునాథ రెడ్డి (22) గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 5 సబ్జెక్టుల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
తనని చదివిస్తున్న పెదనాన్నకు విషయం తెలిస్తే మందలిస్తాడని ఆందోళన చెందిన రఘునాథరెడ్డి సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం రఘునాథ రెడ్డి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మరో ఘటనలో కృష్ణా జిల్లాలోని విజయవాడ లయోలా కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెల్టు పెట్టుకోలేదన్న కారణంతో వినీల్ అనే విద్యార్థిని ఫ్రొఫెసర్ దూషించడంతో మనస్తాపానికి గురైన వినీల్ తన చేతిని కోసుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రొఫెసర్ తీరుపై విద్యార్థులు లయోలా కాలేజి ముందు ఆందోళనకు దిగారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కాలేజి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.