కలిసొచ్చిన పాద యాత్ర..! జగన్ కు అదికారం కట్టబెట్టిన సంకల్ప యాత్ర..!!
అమరావతి/హైదరాబాద్ : పాదయాత్ర.. ఈ పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఈ పేరు చెబితే అధికార పాత్ర తెలుగునాట దాసోహమవుతుందా..? ఎన్నికల ఫలితాలు చూస్తే ఇదే నిజమని నిరూపితమవుతోంది. ఎవరు పాదయాత్ర చేస్తే వారు మరుసటి ఎన్నికల్లో గెలిచి అధికరా పీఠంపై కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో అదే సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో పాదయాత్ర చేసి సీఎం పీఠంపై కూర్చున్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు.
పాదయాత్ర లక్ష్యం నెరవేరింది...! అధికారం సొంతం అయింది..!!
2003లో మూడు నెలల పాటు మండుటెండల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేశారు. 1408 కిలోమీటర్ల మేర చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిచారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. 2012 అక్టోబరు 2న ప్రారంభించి దాదాపు 208 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. హిందూపురం నుంచి ప్రారంభించి విశాఖపట్నం జిల్లా అగనంపూడి వరకు 2817 కిలోమీటర్లు నడిచారు. 2014లో జరిగిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పీఠం దక్కించుకున్నారు.
నాడు వైఎస్, చంద్రబాబు..! ఇప్పుడు జగన్..!!
తాజాగా జగన్ పాదయాత్ర కూడా ఇదే కోవలో చేరింది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులపాటు 13 జిల్లాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమై.. ప్రతి ఒక్కరి సమస్యలు ఆలకిస్తూ 134 నియోజకవర్గాల్లో నడిచారు. ఇందులో ఏకంగా 113 నియోజకవర్గాల్లో జగన్ విజయం సాధించడం విశేషం. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కంటే ఎక్కువగా 3,648 కి.మీ. నడిచిన జగన్ ఏకంగా 2,516 గ్రామాలను చుట్టి వచ్చారు.
అతిపెద్ద ఏకైక పార్టీ..! తిరుగులేని వైసీపి..!!
పాదయాత్ర జరిగిన దాదాపు 85 శాతం నియోజకవర్గాల్లో జగన్ పార్టీనే అధికారం దక్కించుకుంది. మిగిలిన 20 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవగా మరో స్థానంలో జనసేన గెలిచింది. మొత్తంగా టీడీపీకి వచ్చిన 23 సీట్లలో 20 సీట్లు జగన్ పాదయాత్ర సాగిన నియోజకవర్గాలు ఉండగా మరో మూడు సీట్లు పాదయాత్ర జరగని నియోజకవర్గాలుగా ఉన్నాయి. మొత్తానికి సుధీర్గ పాద యాత్ర సంకల్పం కోరుకున్న ఫలితాన్నిచ్చిందని వైసీపి నేతల్లో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలల్లో మంచి సీయంగా నిరూపించుకుంటారా..! రొటీన్ గా పరిపాలిస్తారా..?
సీఎం కుర్చీలో కూర్చోబోతున్న జగన్ కు పరిపాలన అంత సులభమేమీ కాదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీకు ప్రత్యేక హోదా తీసుకురావాల్సి ఉంది. ఇటువంటి విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారనే సందేహాలు కూడా నెలకొన్నాయి. తండ్రి వైఎస్ అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజారంజక పాలన సాగిస్తారా.. లేక గాల్లో మేడలు కడతారా అనేది కూడా మరో సందేహం. కానీ.. జగన్ ఎన్నికల ప్రచారంలో.. పాదయాత్ర సమయంలోనూ వైఎస్లా తాను కూడా మిగిలిపోవాలని.. తన పాలన నచ్చిన ప్రజలు తండ్రి ఫొటో పక్కన తన ఫొటో కూడా పెట్టుకోవాలనేది ఆశ అంటూ చెబుతూ వచ్చారు. నిజంగానే ప్రజలతో అంతగా మమేకమయ్యే నేతగా రాజన్న వారసుడిగా జగన్ ఎంత వరకూ విజయం సాధిస్తారనేది వేచిచూడాలి.