లాక్ డౌన్ 4.0 ముగుస్తున్న వేళ ఏపీలో మరికొన్ని మినహాయింపులు .. ఏపీ ప్రజలకు శుభవార్త
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ 4.0 రేపటితో ముగుస్తుంది. ఇక ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ చేసి కరోనా పరిస్థితులను గురించి, లాక్ డౌన్ 5.0 విధిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై చర్చలు జరిపారు. అంతేకాదు రాష్ట్రాలలో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కరోనా కట్టడి కోసం తగిన నిర్ణయాలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది కేంద్ర సర్కార్.
ఏపీలో ఒక్కడి ద్వారా 82 మందికి కరోనా .. ఒకే ఊరిలో ఏకంగా 54 మంది బాధితులు
ఏపీ ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ప్రకటించిన ఏపీ సర్కార్
ఇక లాక్ డౌన్ 5.0 విధించినప్పటికీ మరికొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.లాక్ డౌన్ ఆంక్షలను కంటైన్మెంట్ జోన్లకు పరిమితం చేసి, ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలపైనే లాక్ డౌన్ ఆంక్షలను పెడుతూ లాక్ డౌన్ కొనసాగించే ఆలోచనలో ఉంది కేంద్ర సర్కార్. ఇక ఈ క్రమంలో తాజాగా 4.0 గడువు రేపటితో ముగుస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది.
కంటైన్మెంట్ జోన్ల వరకే ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనజీవనం నార్మల్ గా కొనసాగే విధంగా ఏపీలోని ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక తాజాగా కూడా మరికొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా రవాణా రంగానికి మినహాయింపులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం .రాష్ట్రంలో కరోనా కేసులుఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లమినహా ,రాష్ట్ర పరిధిలోని ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రజా రవాణా వాహనాలు , ప్రైవేట్ వాహనాలకు అనుమతి
ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు కూడా షరతులతో పర్మిషన్ ఇచ్చింది. అనుమతి పొందిన వాహనాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఆటోలలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణం చేసేలా, కార్లలో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణం చేసేలా, మినీ వ్యాన్ ల లో 50% ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపింది.
Recommended Video
కేంద్ర మార్గదర్శకాలను బట్టి మరి కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం
ఇక రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, బస్సులలో 45 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఏపీ సర్కార్ పేర్కొంది. మొత్తానికి మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులతో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇక అదే సమయంలో కరోనా కట్టడి కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. అంతే కాదు జూన్ 1 తర్వాత కేంద్రం మార్గదర్శకాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్తుంది .